logo

భారీ పేలుళ్లకు పథక రచన !

ఇటీవల పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చిన హిజ్బ్‌ ఉత్‌ తహరీర్‌(హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థ సభ్యుల వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Published : 12 May 2023 02:16 IST

ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చిన హిజ్బ్‌ ఉత్‌ తహరీర్‌(హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థ సభ్యుల వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిందితులు భారీఎత్తున పేలుళ్లకు పథక రచన చేశారని, ఇందుకోసం మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు గుర్తించారు. తొలి దశలో యువతని ఆకర్షించి తమవైపు తిప్పుకొంటారు. రెండో దశలో వారికి సాంకేతికత, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తారు. మూడో దశలో దాడులు చేయిస్తారు. మొత్తంగా మూకుమ్మడి దాడులతో భయానక పరిస్థితిని సృష్టించేందుకు పథకం వేసినట్లు తెలిసింది. తుపాకులు, గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసేందుకు వారు వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌ పోలీసులు భోపాల్‌, హైదరాబాద్‌లో ఏకకాలంలో దాడులు చేసి 16 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో అయిదుగురు హైదరాబాద్‌కు చెందిన వారున్నారు. బుధవారం మరో వ్యక్తిని అరెస్టు చేయడంతో నిందితుల సంఖ్య 17కు చేరింది.

అంతా సలీమ్‌ నేతృత్వంలోనే...

హైదరాబాద్‌లో హెచ్‌యూటీ తరఫున కార్యకలాపాలు నిర్వహించే బాధ్యతను ఓ కళాశాలలో హెచ్‌వోడీగా పని చేస్తున్న మహ్మద్‌ సలీమ్‌ అలియాస్‌ సౌరభ్‌ రాజ్‌ వైద్య పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను గోల్కొండ బడాబజార్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నిందితులంతా అతని నివాసంలోనే ఎక్కువసార్లు సమావేశమైనట్లు తెలిసింది. అబ్దుర్‌ రెహ్మాన్‌, మహ్మద్‌ అబ్బాస్‌ అలీ, షేక్‌ జునైద్‌, మహ్మద్‌ హమీద్‌, మహ్మద్‌ సల్మాన్‌తోపాటు మరికొందరు యువకులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. వీరితో తరచూ సమావేశమవుతూ అజెండాను వివరిస్తూ తమవైపు తిప్పుకొన్నారు. నిందితులు అరెస్టు కాకముందు వివిధ ప్రాంతాల్లో కలిసిన వ్యక్తుల కోసమూ గాలిస్తున్నారు. అలాగే వారు కొన్ని నెలలపాటు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగించినందున ఏయే ప్రాంతాలకు వెళ్లారు..? ఎవరెవర్ని కలిశారనే కోణంలో ప్రత్యేక బృందాలతో నాలుగు ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.

మత మార్పిడిపై 33 వీడియోలు

యువతని ఆకర్షించి, తమ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు నిందితులు ఒక యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ఇందులో మతమార్పిడి, ఇతర అంశాలకు సంబంధించి 33 వీడియోలు ఉన్నాయి. దాదాపు 3,600 మంది దీన్ని సబ్‌స్క్రైబ్‌ చేశారు. మత మార్పిడి అంశంపై ప్రసంగిస్తున్న మహిళను నిందితుల్లో ఒకరి భార్యగా గుర్తించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు