logo

నీటి మీటర్ల పేరుతో మాయాజాలం

జలమండలిలో నీటి మీటర్ల పేరుతో మాయాజాలం నడుస్తోంది. కొందరు మీటర్‌ రీడర్లు హస్తలాఘవం చూపుతున్నారు. ఎక్కువగా అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, హాస్టళ్లు, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నడిపే ప్రాంతాల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.

Published : 26 May 2023 03:13 IST

చేయి తడిపితే రీడింగ్‌ నమోదులో సిబ్బంది అవకతవకలు

ఈనాడు, హైదరాబాద్‌: జలమండలిలో నీటి మీటర్ల పేరుతో మాయాజాలం నడుస్తోంది. కొందరు మీటర్‌ రీడర్లు హస్తలాఘవం చూపుతున్నారు. ఎక్కువగా అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, హాస్టళ్లు, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నడిపే ప్రాంతాల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. మీటర్లు అమర్చడం నుంచి రీడింగ్‌ నమోదు వరకు కొందరు అక్రమాలకు తెరతీశారు.

* సరూర్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గతంలో పెట్టిన ఏఎంఆర్‌ మీటరు పాడైంది. జలమండలి అధికారుల అనుమతితో అపార్ట్‌మెంట్‌ వాసులు మెకానికల్‌ మీటర్‌ కొని అమర్చుకున్నారు. తర్వాత అక్కడకు వచ్చిన మీటరు రీడర్‌ తనకు తెలియకుండా కొత్త మీటరు ఎలా పెట్టుకుంటారని చిందులు తొక్కాడు. రికార్డుల్లో ఆ కనెక్షన్‌ను ఉచిత నీటి పథకం నుంచి తొలగించాడు. వరుసగా నెలవారీ బిల్లులు రావడంతో అవాక్కైన అపార్టుమెంట్‌ వాసులు జలమండలి ఉన్నతాధికారులను సంప్రదించగా విషయం తేలింది. అధికారులు విచారించి వారు చెల్లించిన డబ్బును సర్దుబాటు చేశారు. కేవలం తన వద్ద మీటర్‌ తీసుకోలేదనే అక్కసుతో మీటర్‌ రీడర్‌ ఇలా చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.

* దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ మీటరు రీడరు రీడింగ్‌ సర్దుబాటు చేసేందుకు చుట్టుపక్కల అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పర్యవేక్షణ వదిలేసిన ఏజెన్సీలు..

నీటి మీటర్ల రీడింగ్‌, బిల్లుల పంపిణీ అంతా జలమండలి ప్రైవేటు ఏజెన్సీలకు కేటాయించింది. ఈ ఏజెన్సీల ఆధ్వర్యంలో రీడర్లు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. పలు ఏజెన్సీలు తమ సిబ్బందిపై పర్యవేక్షణ గాలికొదిలేసినట్లు విమర్శలున్నాయి. రీడింగ్‌ నమోదు, బిల్లుల పంపిణీకి ఏటా ఈ ఏజెన్సీలకు జలమండలి రూ.కోట్లు చెల్లిస్తున్నా ఆశించిన మేరకు ఆదాయం పెరగడం లేదు.

అక్రమాలు ఇలా...

* కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీలు, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు ఉన్నచోట 20 లీటర్ల రీడింగ్‌ దాటకుండా కొందరు రీడర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు.

* 15ఎంఎం కనెక్షన్‌కు రూ.1200 లోపే మెకానికల్‌ మీటరు బహిరంగ మార్కెట్‌లో దొరుకుతోంది. ఇందుకు 12 కంపెనీలను జలమండలి ఎం-ఫ్యానల్‌ చేసింది. వినియోగదారులే నేరుగా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. కొందరు మీటర్‌ రీడర్లు మాత్రం తామే బిగిస్తామని చెప్పి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు.

* ఎంఎఆర్‌ మీటర్ల ఉన్నచోట నెలలో 10-15 రోజుల పాటు మీటరుకు అమర్చిన వైర్లను పీకేస్తున్నారు. ఇందుకు కొంత వసూలు చేస్తున్నారు. తర్వాత వచ్చి మళ్లీ వైర్లు అమర్చుతున్నారు.

* చాలామంది అక్రమంగా నీటి కనెక్షన్లు తీసుకుంటున్నా.. ఆ విషయం మీటర్‌ రీడర్లకు తెలిసినా అధికారుల దృష్టి తేకుండా.. వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మీటరింగ్‌ వ్యవస్థపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని