logo

Hyderabad: పదిహేనేళ్ల సహజీవనం.. 15 కత్తిపోట్లు

సంచలనం సృష్టించిన ఎర్రం అనురాధరెడ్డి(55) దారుణ హత్యోదంతం కేసులో మరికొన్ని కోణాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బి.చంద్రమోహన్‌ అరెస్టు, రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొంటున్న పలు కీలక అంశాలు తెలిశాయి.

Updated : 27 May 2023 09:20 IST

మహిళ దారుణ హత్యలో వెలుగుచూసిన కోణం

సైదాబాద్‌, న్యూస్‌టుడే: సంచలనం సృష్టించిన ఎర్రం అనురాధరెడ్డి(55) దారుణ హత్యోదంతం కేసులో మరికొన్ని కోణాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు బి.చంద్రమోహన్‌ అరెస్టు, రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొంటున్న పలు కీలక అంశాలు తెలిశాయి. అనురాధతో 15 ఏళ్లు సాగిన సహజీవనానికి గుర్తుగా నిందితుడు 15 కత్తిపోట్లు పొడిచి హత్య చేశాడని సమాచారం. కొన్నాళ్లుగా ఇరువురి మధ్య విభేదాలు తలెత్తడంతోనే మరో పెళ్లికి సిద్ధపడిన అనురాధ తమిళ మాట్రిమోనీలో ప్రకటనలు ఇచ్చింది. పెళ్లి చేసుకోబోతున్న తనకు రూ.17 లక్షల నగదు, 2 కిలోలకుపైగా బంగారం తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నిందితుడు, అనురాధ అడ్డు తొలగితే నగదు, నగలు ఇవ్వాల్సిన అవసరముండదని భావించి హత్యకు పథకం రూపొందించాడు. ఈ నెల 12న గొడవపడి కత్తితో 15సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఒకరోజు మృతదేహాన్ని అలాగే బయటే ఉంచిన నిందితుడు, పక్కనే అద్దెకుండేవారు ఊరికెళ్లాక  స్టోన్‌ కట్టర్లు తెచ్చి ముక్కలు చేశాడు. ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచాడు. 15న తలను మూసీ నది పరివాహక ప్రాంతం తీగలగూడ రహదారికి పక్కన ఖాళీ స్థలంలో పడేశాడు. అంతర్జాలంలో చూసి మృతదేహాన్ని ఆరు ముక్కలు చేశాడని రిమాండ్‌ నివేదికలో పోలీసులు వివరించారు. చెడు వాసన వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న నిందితుడు అందుకు కొన్ని రసాయనాలు వాడానని విచారణలో అంగీకరించాడు.

చార్‌ధామ్‌కు వెళుతున్నట్లు చాటింగ్‌..

అనురాధను హతమార్చిన నిందితుడు తరువాత ఆమె చరవాణి వినియోగిస్తూ.. అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. కుమార్తెతోపాటు బంధువులతో అనురాధకు మంచి సంబంధాలు లేవని గుర్తించి.. దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. ఆమెను చంపితే ఎవరూ పెద్దగా పట్టించుకోరనే నమ్మకం బలపడటంతో.. చార్‌ధామ్‌ వెళ్తున్నట్లు సంక్షిప్త సందేశం కుమార్తెకు పంపాడు. అక్కడికి వెళ్లిన అనంతరం సెల్‌ఫోన్‌ ధ్వంసం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని పోలీసుల ద్వారా తెలిసింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి నుంచి రాచకొండ కమిషనరేట్‌కు కేసును శుక్రవారం బదిలీ చేశారు. మరో రెండురోజుల్లో చైతన్యపురి ఠాణాకు కేసు పూర్వపరాలు అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని