logo

ఐటీ అధికారుల వేషం.. బంగారంతో మాయం

సికింద్రాబాద్‌ మార్కెట్‌ ఠాణా పరిధిలోని పాట్‌ మార్కెట్‌లోని నవకార్‌ కాంప్లెక్స్‌. నాలుగో అంతస్తులో బాలాజీ గోల్డ్‌షాప్‌ ఉంది.

Published : 28 May 2023 01:45 IST

సికింద్రాబాద్‌ నగల దుకాణంలో దోపిడీ

సీసీ కెమెరాల ఫుటేజ్‌లో నిందితుల చిత్రాలు

ఈనాడు, హైదరాబాద్‌ -రెజిమెంటల్‌ బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ మార్కెట్‌ ఠాణా పరిధిలోని పాట్‌ మార్కెట్‌లోని నవకార్‌ కాంప్లెక్స్‌. నాలుగో అంతస్తులో బాలాజీ గోల్డ్‌షాప్‌ ఉంది. అక్కడ ముగ్గురు కార్మికులు బంగారు మెల్టింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో టిప్‌టాప్‌గా తయారైన ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆ దుకాణంలోకి ప్రవేశించారు. తాము  ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులమంటూ ఐడీ కార్డులు చూపారు. బంగారు దుకాణంలో అవకతవకలు జరిగాయంటూ హడావుడి చేశారు. రికార్డులు పరిశీలించారు. పనివాళ్ల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కొని, గదిలో బంధించి.. 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయారు.
పట్టపగలు జరిగిన దోపిడీ సంచలనం రేకెత్తించింది. నకిలీ వేషాలతో వచ్చిన ఆగంతుకులు మహారాష్ట్రకు చెందిన కేటుగాళ్లు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన వివరాలను మహంకాళి ఏసీపీ రమేష్‌ వెల్లడించారు. షోలాపూర్‌కు చెందిన రేవన్‌ మధుకర్‌ డాబర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ బామ్మర్దితో కలసి సిద్దివినాయక జ్యువెల్లర్‌ పేరుతో అక్కడ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల క్రితమే పాట్‌మార్కెట్‌లోని నవ్‌కార్‌ కాంప్లెక్స్‌లో బాలాజీ గోల్డ్‌షాప్‌ పేరుతో మెల్టింగ్‌ కార్ఖానా ప్రారంభించాడు. మూడు రోజుల క్రితం మధుకర్‌ సొంతూరు వెళ్లటంతో బామ్మర్ది వికాస్‌ కేదేకర్‌ రెండు దుకాణాలు పర్యవేక్షిస్తున్నాడు. శనివారం ఘటన జరిగిన సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌ దుకాణంలో ఉన్నాడు.
పనివాళ్లను గదిలో పెట్టి.. ఉదయం  దుకాణంలోకి ఐదుగురు వ్యక్తులు వచ్చి ఐటీ అధికారులమంటూ గుర్తింపుకార్డులు చూపారు. పనివాళ్ల వద్ద నుంచి 1700 గ్రాముల బంగారం బిస్కెట్లు తీసుకున్నారు. యజమానితో ఫోన్‌లో మాట్లాడాలంటూ చెప్పినా వినకుండా వారిని గదిలోకి నెట్టి బయట గడియపెట్టారు. కొట్టేసిన బంగారంతో పారిపోయారు. ఐటీ అధికారులంటూ వచ్చిన వ్యక్తులు ఫోన్లు లాక్కోవటం, గడియపెట్టడంతో అనుమానం వచ్చిన కార్మికులు బిగ్గరగా కేకలు వేశారు. గమనించిన పక్కన ఉన్న వారొచ్చి గడియ తీశారు. అనంతరం కేదేకర్‌ వచ్చి మార్కెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరమండలం డీసీపీ చందనాదీప్తి, ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు.  
నడుచుకుంటూ వచ్చి..  నగరంలో ప్రస్తుతం ఆదాయపన్నుశాఖ పలుచోట్ల దాడులు నిర్వహిస్తోంది. దీన్ని అవకాశం చేసుకొనే దోపిడీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నడుచుకుంటూ వచ్చిన ఆగంతుకులు బంగారం చేతికి అందగానే  ఆటో ఎక్కినట్టు సీసీకెమెరాల ఆధారంగా గుర్తించారు. ఐదుగురూ జేబీఎస్‌ వరకూ వెళ్లినట్టు సెల్‌ఫోన్ల సిగ్నల్‌ బట్టి గుర్తించారు. బస్‌స్టేషన్‌కు చేరాక సెల్‌ఫోన్లను స్విచ్చాఫ్‌ చేశారని పోలీసులు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు