logo

దశాబ్ది అదరాలి.. అభివృద్ధి చాటాలి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాజధానిలో వైభవంగా నిర్వహించాలని  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశించారు.

Published : 28 May 2023 01:45 IST

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని, చిత్రంలో  మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, నగర సీపీ సీవీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాజధానిలో వైభవంగా నిర్వహించాలని  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా జూన్‌ 2 నుంచి 22 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి శనివారం రాష్ట్ర సచివాలయంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌లో నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించాలన్నారు. కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు  ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ‘‘జూన్‌ 2న గన్‌ పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పిస్తారు. అనంతరం సచివాలయంలో పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు ప్రారంభిస్తారు. గడిచిన తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజెప్పాలనేది సీఎం ఆదేశం. రోజుకో శాఖ.. తమ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను వివరించాలి. దశాబ్ది ఉత్సవాలను ప్రతిబింబించేట్లుగా.. చెరువులు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, బడులు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో విద్యుద్దీపాలంకరణ చేయండి’’ అని తలసాని తెలిపారు.  మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు నాగేందర్‌, వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, కార్పొరేషన్ల ఛైర్మన్లు శ్రీధర్‌రెడ్డి, నగేశ్‌, అయాచితం శ్రీధర్‌, విప్లవ్‌కుమార్‌, క్రిశాంక్‌, నగర గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ప్రసన్న, బీసీ కమిషన్‌ సభ్యులు కిశోర్‌గౌడ్‌, నగర సీపీ సీవీ ఆనంద్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేన, కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, బల్దియా కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని