Harishrao: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్‌: మంత్రి హరీశ్‌రావు

వైద్యరంగంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 28 May 2023 16:16 IST

ఎల్లారెడ్డి: వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డిలో రూ.15 కోట్లతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం గండిమాసానిపేట్‌లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వాళ్ల విమర్శలను తిప్పికొట్టాలని ప్రజలు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

‘‘కేసీఆర్‌ హయాంలో ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష సాయం అందుతోంది. అదే గుజరాత్‌ రాష్ట్రంలో రూ.12వేలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా రెండేళ్లకు వస్తదట. ఇలాంటి పథకం పక్కన ఉన్న మహారాష్ట్రలో ఉందా?  కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉందా? దీని గురించి ప్రజలు ఆలోచన చేయాలి. మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు.. ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్‌గా తయారయ్యాయి. ఎందుకంటే ప్రతిపక్షాల వాళ్లు జూటా మాటలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌, భాజపా నేతలు రాష్ట్ర గౌరవాన్ని కించపర్చే విధంగా మాట్లాడుతున్నారు’’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.

తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది

‘‘మన రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది అనేది ఇప్పుడు దేశంలో నానుడి. మహారాష్ట్రలోని రైతులంతా కలిసి తెలంగాణలో ఉన్న పథకాలు మాకు కావాలని పోరాటం చేస్తే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ వేసింది. ఇది మనకు గౌరవం కాదా? తెలంగాణలో ఉన్నట్టు మాకు రైతుబంధు, రైతు బీమా, 24గంటల కరెంట్, చెరువుల అభివృద్ధి, పండిన పంట కొనాలె అని అడుగుతున్నారు. మన రాష్ట్ర పథకాలు బాగున్నాయి కనుకనే దేశం మొత్తం మనవైపు చూస్తోంది. దీన్ని ప్రజలంతా గమనించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

కాంగ్రెస్‌ పాలన మైగ్రేషన్.. బీఆర్‌ఎస్‌ పాలన ఇరిగేషన్‌

ఇక్కడికి వచ్చిన మహారాష్ట్ర రైతులను నేనే స్వయంగా అడిగా..  సాగుకోసం ఈరోజుకీ వాళ్లు ఆయిల్‌ ఇంజిన్లు వాడుతున్నారని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలో కరెంట్‌ తీగలు లేక ఆయిల్‌ ఇంజిన్ల మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. ఇంతకంటే ఘోరం ఉంటదా? తెలంగాణలో టార్చ్‌లైట్‌ పెట్టి వెతికిన ఇప్పుడు ఆయిల్‌ ఇంజిన్లు కనిపిస్తాయా? వాళ్లేమో (భాజపా నేతలను ఉద్దేశించి) డబుల్‌ ఇంజిన్‌ అని అంటారు. అసలు డబుల్‌ ఇంజిన్లు కాదు.. వాళ్లు పాలించే రాష్ట్రంలో ఇంకా ఆయిల్‌ ఇంజిన్లే ఉన్నాయి. జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ 24గంటల కరెంట్‌ ఇస్తే చిత్రం.. చమత్కారమే అన్నారు. మరి ఇప్పుడు 24 గంటలు వచ్చిందా లేదా? కేసీఆర్‌ ఏమన్నా మంత్రం వేశారా? ఆయన దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్‌ అద్భుత దీపం ఉందా? దీనివెనక  కేసీఆర్‌ కృషి, పట్టుదల ఉంది. ఆనాటి కాంగ్రెస్‌ పాలనలో అందరూ వలసలు వెళ్లే పరిస్థితి ఉండేది. కాంగ్రెస్‌ పాలన మైగ్రేషన్‌ అయితే.. బీఆర్‌ఎస్‌ పాలన ఇరిగేషన్‌. వలసలు వెళ్లినవాళ్లు ఇప్పుడు వాపస్‌ వస్తున్నారు. బ్రహ్మండంగా వాళ్లకున్న ఎకరం పొలంలో రెండు పంటలు తీస్తున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు