logo

నిబంధనలు పాటించరు.. పరిశుభ్రత పట్టించుకోరు..!

జిల్లాలోని పలు హోటళ్లు, టిఫిన్‌ కేంద్రాలు నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రతతో కొనసాగుతున్నాయి. తాండూరు, పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీలు. వీటిలోనే అధికంగా హోటళ్లు ఉన్నాయి.

Published : 29 May 2023 03:00 IST

హోటళ్లలో కరవైన తనిఖీలు

అపరిశుభ్రంగా వంటశాల

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి, తాండూరుటౌన్‌, కొడంగల్‌: జిల్లాలోని పలు హోటళ్లు, టిఫిన్‌ కేంద్రాలు నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రతతో కొనసాగుతున్నాయి. తాండూరు, పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీలు. వీటిలోనే అధికంగా హోటళ్లు ఉన్నాయి. కొన్ని హోటళ్లు పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నా మరి కొన్నింటిలో ఎలాంటి నిబంధనలు పాటించటం లేదు. చిన్న హోటళ్లు, టిఫెన్‌ షాపులు సహజంగా మురుగు కాలువల పక్కనే ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే కాలువన్నీ మురుగుతో పొంగి పొర్లుతుంటాయి. అలాంటి వాతావరణంలో టిఫిన్‌ తింటే ఆరోగ్యం దెబ్బతినే వీలుంటుంది. కాబట్టి అధికారులు తనిఖీలు చేపట్టి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  

జిల్లా కేంద్రంలో కనిపించని స్వచ్ఛత

జిల్లా కేంద్రంలో హోటళ్లు, ఫలహార కేంద్రాలు కలిపి సుమారుగా 64 వరకు ఉన్నాయి. తాండూర్‌లో 98, పరిగిలో 48 కొడంగల్‌లో 30 వరకు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా లోపలే కాకుండా పరిసర ప్రాంతాలు కూడా అపరిశుభ్రంగా ఉంటున్నాయి. మిగిలిపోయిన పప్పు, సాంబార్‌ను వేడి చేసి వడ్డిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా అన్నాన్ని కొత్తగా వండిన దాంట్లో కలిపి వడ్డిస్తున్నారు.

* రెండు నెలల క్రితం వికారాబాద్‌ పట్టణంలో పుర అధికారులు హోటళ్లను టిఫిన్‌ సెంటర్లను తనిఖీ చేశారు. పలు లోపాలను గుర్తించి సరిచేయాలని చెప్పారు. నేటికీ పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి.

మూసి ఉన్న జిల్లా కార్యాలయం

ఇవిగో అధికారుల సూచనలు

* వాడిన పాత్రలను వేడి నీటిలో కడిగి తిరిగి వినియోగించాలి.

* ఆహారాన్ని తయారు చేసేవారికి, వీటిని సరఫరా చేసే వారికి అంటురోగాలు ఉండకూడదు.  

* ఎట్టి పరిస్థితుల్లో బాలలతో పని చేయించకూడదు.

* ఫ్రిజ్‌లో వండిన పదార్థాలు నిల్వ ఉంచి మరునాడు, రెండు రోజులు వరకు వాడుతున్నారు. ఇలా చేయవద్దు.  

* నూనెలు, పసుపు, కారంపొడి, పప్పులు, బియ్యం, ఇతర ఆహార వస్తువులను నాణ్యమైన వాటినే వాడాలి.

బోర్డు మాత్రమే కనిపిస్తుంది

కొత్తగా జిల్లాలు ఏర్పడటంతో వికారాబాద్‌ పురపాలక సంఘ కార్యాలయంలో రెండేళ్ల క్రితం జిల్లా ఆహార పరిరక్షణ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కనాడు కూడా అధికారులు ఈ కార్యాలయాన్ని తీయలేదన్న ఆరోపణలున్నాయి. బోర్డు మాత్రమే కనిపిస్తుంది.


తనిఖీలు ముమ్మరం
- సయ్యద్‌ మొహియొద్దీన్‌, పుర పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్‌, వికారాబాద్‌.

పట్టణంలో తరచుగా తనిఖీలను నిర్వహించి హోటళ్లు నిబంధనలు పాటించేలా చూస్తాం. ప్రతి హోటల్‌ యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. పరిశుభ్రత లేని హోటళ్లపై చర్యలు తీసుకుంటాం.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని