Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్‌ లేదేంటో..

గచ్చిబౌలిలో ఉండే శంతన్‌.. సికింద్రాబాద్‌కని బయలుదేరారు.. కారును రాయదుర్గంలో పార్క్‌ చేసి మెట్రోలో వెళ్లాలనేది ఆలోచన. కారు పార్కింగ్‌కు అక్కడ స్థలం లేదు. చేసేది లేక హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ వరకు వచ్చి అక్కడ మెట్రో మాల్‌లో పార్క్‌ చేసి వెళ్లారు.

Updated : 29 May 2023 09:19 IST

15 ఎకరాలు కేటాయించినా ఐటీ టవర్‌ నిర్మాణంతో సరిపెట్టిన సంస్థ
ఈనాడు, హైదరాబాద్‌

రాయదుర్గంలో మెట్రోకు కేటాయించిన స్థలంలో వెలిసిన వాణిజ్య కార్యాలయం

గచ్చిబౌలిలో ఉండే శంతన్‌.. సికింద్రాబాద్‌కని బయలుదేరారు.. కారును రాయదుర్గంలో పార్క్‌ చేసి మెట్రోలో వెళ్లాలనేది ఆలోచన. కారు పార్కింగ్‌కు అక్కడ స్థలం లేదు. చేసేది లేక హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ వరకు వచ్చి అక్కడ మెట్రో మాల్‌లో పార్క్‌ చేసి వెళ్లారు. రద్దీవేళ రాయదుర్గం నుంచి హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌కు చేరుకునే సరికి అరగంట పట్టింది. రాయదుర్గంలోనే పార్కింగ్‌ ఉంటే అరగంట వ్యవధిలో మెట్రోలో బేగంపేట దాటి ఉండేవారు. సరైన పార్కింగ్‌ సదుపాయం లేక చాలామంది పడుతున్న ఇబ్బందులివి.

ప్రభుత్వం మెట్రోకు రాయదుర్గంలో 15 ఎకరాల స్థలం రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద లీజుకు కేటాయించింది. వాణిజ్య, కార్యాలయాలు, ఇతరత్రా అభివృద్ధి చేసి లీజుకు, అద్దెకు ఇవ్వడం ద్వారా 50 శాతం టిక్కెటేతర ఆదాయం సమకూర్చుకునేందుకు ఈ భూమి ఇచ్చింది. ఇక్కడ ఏం అభివృద్ధి చేసినా సెల్లార్‌, కింది అంతస్తుల్లో మెట్రో ప్రయాణికులకు పార్కింగ్‌ సదుపాయం కల్పించాలనేది ఒప్పందం. అయితే ఆ స్థలంలో కొంతభాగంలో భారీ ఐటీ టవర్‌ నిర్మాణం జరిగింది. పార్కింగ్‌ సదుపాయం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం మెట్రోస్టేషన్‌ అందుబాటులోకి వచ్చి మూడేళ్లు దాటుతోంది. ఇప్పటికీ ఆ ఊసే లేదు. మెట్రో బ్లూలైన్‌ మార్గం తొలుత శిల్పారామం వరకే. అక్కడ చెరువు ఉండటంతో స్టేషన్‌ నిర్మాణానికి భూమి పటిష్ఠంగా ఉండదని రాయదుర్గం వరకు పొడిగించారు. చివరి స్టేషన్‌ కావడంతో వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మెట్రోలో ప్రయాణిస్తుంటారు. ఇలాంటి చోట మెట్రోకు భూమి కేటాయించినా పార్కింగ్‌ సదుపాయం మాత్రం కల్పించడం లేదు.

పలు ప్రాంతాల్లో..

మియాపూర్‌, నాగోల్‌లో డిపోల కోసం 200 ఎకరాలకుపైగా కేటాయించింది. ఇందులో 30 శాతం టీవోడీ అభివృద్ధికి అవకాశం కల్పించారు. పలుచోట్ల 2-15 ఎకరాలు కేటాయించారు. అక్కడ పార్కింగ్‌ కల్పించాలని ఒప్పందం. డిపోలు, మాల్స్‌ ఉన్న నాగోల్‌, మియాపూర్‌, మలక్‌పేట, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, హైటెక్‌సిటీ, రసూల్‌పురా, మియాపూర్‌లో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. ప్రారంభ స్టేషన్లు మియాపూర్‌, నాగోల్‌, ఎల్బీనగర్‌, మియాపూర్‌ వద్ద ఎల్‌ అండ్‌ టీకి కేటాయించిన స్థలంలో వాహనాలు పార్క్‌ చేసి నిత్యం వేలమంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని