logo

శిఖం కుంట.. కనిపించదిక

ప్రభుత్వ స్థలాలకు కంచెలు వేయడం... చెరువులను రాత్రికి రాత్రే పూడ్చి నిర్మాణాలు చేపట్టడం కబ్జాదారులకు నిత్యకృత్యమయ్యాయి.

Published : 30 May 2023 02:12 IST

రూ.30 కోట్ల భూమిలో నిర్మాణాలు

శిఖం కుంట చెరువు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కుత్బుల్లాపూర్‌, షాపూర్‌ నగర్‌: ప్రభుత్వ స్థలాలకు కంచెలు వేయడం... చెరువులను రాత్రికి రాత్రే పూడ్చి నిర్మాణాలు చేపట్టడం కబ్జాదారులకు నిత్యకృత్యమయ్యాయి. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని శిఖంకుంట చెరువుకు చెందిన రెండు ఎకరాల భూమిలో మూడు రోజులుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ స్థలం విలువ రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. చుట్టుపక్కల భవనాలు ఉండడంతో.. ఆక్రమించి ఇళ్లు నిర్మించి విక్రయించాలనేది అక్రమార్కుల ప్రణాళిక. రెవెన్యూ అధికారి ఒకరు తెర వెనుక ఉండి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం.

గతంలో ఎనిమిది ఎకరాలు..

13 ఎకరాలున్న శిఖం కుంట చెరువులో రెండు దశాబ్దాల క్రితమే 8 ఎకరాలు కబ్జా చేశారు. బలహీనవర్గాల కాలనీతో బినామీ పేర్లలో ఆక్రమణలకు కొందరు రాజ ముద్రలు వేయించుకున్నారు. మిగిలిన 5 ఎకరాలను రక్షించేందుకు జీహెచ్‌ఎంసీ, నీటి పారుదల విభాగం అధికారులు రూ.1.5 కోట్లతో సుందరీకరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రణాళికను అమలు చేద్దాం అనుకుంటుండగా.. అక్రమార్కులు రెండు ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారు. బఫర్‌ జోన్‌ స్థలాల్లోనూ హద్దు రాళ్లు వేశారు. రాత్రికి రాత్రే చెరువును పూడ్చేసి గదులు నిర్మిస్తున్నారు.

ఇళ్ల నిర్మాణాలు

అందరికీ తెలుసు.. 

గాజులరామారం 23 సర్వే నంబరులో 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొత్త చెరువు విస్తరించి ఉంది. ఇందులో కొంత ప్రైవేటు పట్టా భూమి ఉంది. పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు, ప్రభుత్వ భూములున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు చెరువును పూడ్చేస్తుండడంతో.. బఫర్‌ జోన్‌లోని పట్టా భూమి ఉన్న యజమాని కూడా తన స్థలం చుట్టూ కంచె వేస్తున్నాడు. ఇవన్నీ తెలిసినా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. భూ కబ్జాదారులకు బాసటగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మేడ్చల్‌ జిల్లా ఆర్డీవో మల్లయ్యను సంప్రదించగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలంటూ ఎమ్మార్వోను ఆదేశించామన్నారు. ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో నివేదిక ఇవ్వాలంటూ కోరామని.. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని