logo

శివారులో యువకుడి శవం

శివారులో ఓ యువకుడి మృతదేహం లభించిన ఘటన కలకలం రేపింది. ఎల్బీనగర్‌ పరిధిలోని పెద్దఅంబర్‌పేట్‌- నాగోల్‌ వెళ్లేదారిలో కుంట్లూర్‌ గ్రామం రోడ్డు పక్కనే ఉన్న డాక్టర్స్‌ కాలనీలో సోమవారం స్థానికులు కొందరు మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా విపరీతమైన దుర్వాసన రావడాన్ని గమనించారు.

Published : 30 May 2023 02:12 IST

కుళ్లినస్థితిలో మృతదేహం..
హత్యగా అనుమానిస్తున్న పోలీసులు
వివాహేతర సంబంధమే కారణమా?

రాజేష్‌

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: శివారులో ఓ యువకుడి మృతదేహం లభించిన ఘటన కలకలం రేపింది. ఎల్బీనగర్‌ పరిధిలోని పెద్దఅంబర్‌పేట్‌- నాగోల్‌ వెళ్లేదారిలో కుంట్లూర్‌ గ్రామం రోడ్డు పక్కనే ఉన్న డాక్టర్స్‌ కాలనీలో సోమవారం స్థానికులు కొందరు మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా విపరీతమైన దుర్వాసన రావడాన్ని గమనించారు. నిర్మానుష్య ప్రాంతంలో నిర్మించిన ఓ ప్రహరీ పైనుంచి చూడగా కుళ్లిన స్థితిలో మృతదేహం ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలంలో లభించిన సెల్‌ఫోన్‌ ఆధారంగా మృతుడు ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్‌గా గుర్తించారు. 

కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి..

హయత్‌నగర్‌ పోలీసులు, సంబంధీకుల వివరాల ప్రకారం.. పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావుల పరుశురాములు, విజయ దంపతుల పెద్ద కుమారుడు రాజేష్‌ (25) ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందూ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండేళ్ల క్రితం బీటెక్‌ పూర్తిచేశాడు. అప్పట్నుంచి ఖాళీగానే ఉంటున్నాడు. రాజేష్‌ బాల్య స్నేహితుడు ములుగు జిల్లా గోపాల్‌రావుపేట్‌ మండలం పసుర గ్రామానికి చెందిన సాయి ప్రకాశ్‌ చైతన్యపురి సాయినగర్‌ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈనెల 20న ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన రాజేశ్‌ స్నేహితుడితోపాటే ఉన్నాడు. 22న మధ్యాహ్నం శ్రీఇందూ కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి బయటకువచ్చాడు. మరునాడు సాయి ప్రకాశ్‌కు ఫోన్‌చేసి స్వగ్రామం వెళ్తానని ఛార్జీలకు డబ్బులు కావాలని కోరడంతో రూ.300 పంపించాడు. అదే రోజు రాజేష్‌ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న సమీప బంధువు వద్దకు వెళ్లి కలిశాడు. 24న మరో స్నేహితుడికి కాల్‌చేసి డబ్బులు కావాలని అడిగాడు.అనంతరం  25, 26 తేదీల్లో పలుమార్లు స్నేహితులు కాల్‌ చేసినా రాజేష్‌ ఫోన్‌ ఎత్తలేదు.  27న మళ్లీ కాల్‌చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. ఆ తర్వాత సోమవారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఈనెల 26నే రాజేశ్‌ మృతి చెందినట్లు భావిస్తున్నారు. చేతికంది వచ్చిన కన్నకొడుకు మృతదేహాన్ని చూసిన రాజేశ్‌ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

విలపిస్తున్న మృతుడి తల్లిదండ్రులు

ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా..: సోమవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మృతదేహం పక్కన సెల్‌ఫోన్‌, ఓ కండోమ్‌ లభించినట్లు సమాచారం. ఫోన్‌లోని కాల్స్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి గది నుంచి బయటకు వచ్చాక అతను ఎక్కడెక్కడ తిరిగిందీ ఆరా తీస్తున్నారు.   

ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో....

హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో రాజేష్‌కు కొంతకాలంగా ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి బంధం గురించి భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించారు. మనస్తాపానికి గురైన ఆమె తాను చనిపోతానంటూ రాజేష్‌తో జరిపిన వాట్సప్‌ చాటింగ్‌లో చెప్పడంతో అలా చెయొద్దని తానూ చనిపోతానని రాజేశ్‌ చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆమె ఈనెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మృతి చెందింది. కాగా ఈనెల 24 నుంచీ రాజేశ్‌ సదరు మహిళ  ఇంటి చుట్టూ తిరుగుతుండగా.. ఆమె కుమారుడు గమనిం చాడు. తన స్నేహితులతో కలిసి ఈనెల 26న రాజేశ్‌ను పట్టుకొని నిలదీసి, అతని సెల్‌ఫోన్‌ పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో వారు రాజేశ్‌ను కొట్టి హెచ్చరించి వదిలేసినట్లు సమాచారం. ఆ తర్వాత మనస్తాపంతో రాజేష్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని