logo

Hyderabad: కోరిక తీర్చడం లేదని.. బాలింతను హత్య చేసిన భర్త

తన కోరిక తీర్చడం లేదని నెలరోజుల బాలింత అయిన భార్యను భర్త హతమార్చిన ఉదంతం సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

Updated : 01 Jun 2023 09:35 IST

పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి

సైదాబాద్‌, న్యూస్‌టుడే: తన కోరిక తీర్చడం లేదని నెలరోజుల బాలింత అయిన భార్యను భర్త హతమార్చిన ఉదంతం సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోస్టుమార్టం నివేదికతో బయటపడింది. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చారుకొండ ప్రాంతం అగ్రహారం తండాకు చెందిన జటావత్‌ తరుణ్‌(24), ఝాన్సీ(20) ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నగరానికి వచ్చి ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ ఖాజాబాగ్‌లోని మదర్సా అష్రఫ్‌ ఉల్‌ ఉలూం పరిసరాల్లో నివసించసాగారు. తరుణ్‌ ఆటోడ్రైవర్‌. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. గత ఏప్రిల్‌ 16న కూతురు పుట్టింది. మే 20న అర్ధరాత్రి భార్యతో తరుణ్‌ తన కోరికను వెల్లడించారు. నీరసంగా ఉందంటూ ఆమె నిరాకరించినా వినిపించుకోకుండా భర్త బలవంతం చేస్తుండటంతో ఆమె బిగ్గరగా కేకలు వేసేందుకు ప్రయత్నించింది. దీంతో తరుణ్‌ తన కుడిచేతితో ఆమె తలను మంచంపై అదిమి పెట్టాడు. ముక్కు, నోటి మీద అరచేతిని కొంతసేపు అలాగే ఉంచడంతో ఆమెకు శ్వాస ఆడలేదు. ఈ క్రమంలో ఝాన్సీ నోటిలో నుంచి నురగలు వచ్చి అపస్మారకస్థితికి చేరుకుంది.

పరిసరాల్లో ఉన్న తమ బంధువులకు విషయం చెప్పడంతో వారంతా కలిసి హుటాహుటిన కంచన్‌బాగ్‌లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించి పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి శవపరీక్షకు తరలించారు. ఝాన్సీ తండ్రి నెనావత్‌ రేఖ్యా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తరుణ్‌ ఏమీ తెలియనట్లే ఉన్నాడు. మంగళవారం పోస్టుమార్టం నివేదిక రావడంతో అసలు విషయం బహిర్గతమైంది. తరుణ్‌ను అదుపులోకి తీసుకుని వారు విచారించగా ఆరోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించాడు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని