logo

టిమ్స్‌ నిర్మాణానికి కంటోన్మెంట్‌ బోర్డు ఆమోదం

రాష్ట్ర ప్రభుత్వం బొల్లారంలో నిర్మించనున్న టిమ్స్‌ ఆసుపత్రి భవన నిర్మాణ ప్రతిపాదనను బోర్డు పాలకమండలి ఆమోదించింది. పాలకమండలి అధ్యక్షుడు బ్రిగేడియర్‌ సోమశంకర్‌ నేతృత్వంలో గురువారం జరిగిన బడ్జెట్‌ సమావేశంలో నామినేటెడ్‌ సభ్యుడు రామకృష్ణ, సీఈవో మధుకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Published : 02 Jun 2023 03:11 IST

భద్రతాపరమైన అంశాలపై పాలకమండలి సమావేశంలో చర్చ

సమావేశంలో పాల్గొన్న బోర్డు పాలకమండలి, ఆర్‌అండ్‌బీ అధికారులు

కంటోన్మెంట్‌: రాష్ట్ర ప్రభుత్వం బొల్లారంలో నిర్మించనున్న టిమ్స్‌ ఆసుపత్రి భవన నిర్మాణ ప్రతిపాదనను బోర్డు పాలకమండలి ఆమోదించింది. పాలకమండలి అధ్యక్షుడు బ్రిగేడియర్‌ సోమశంకర్‌ నేతృత్వంలో గురువారం జరిగిన బడ్జెట్‌ సమావేశంలో నామినేటెడ్‌ సభ్యుడు రామకృష్ణ, సీఈవో మధుకర్‌నాయక్‌ పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ విశ్వకుమార్‌ పాల్గొని టిమ్స్‌ నిర్మాణంపై బ్రిగేడియర్‌కు వివరించారు.

బొల్లారంలోని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 28ఎకరాల 16గుంటల విస్తీర్ణంలో ఉన్న స్థలంలో మొత్తం ఆరెకరాల విస్తీర్ణంలో జి+8అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టనున్నామని, 2025 ఏప్రిల్‌వరకు భవనం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.  భద్రతా విషయాలలో సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఈవో సూచించారు.

* భద్రతాపరమైన అంశాలను రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ పరిశీలించిందని, ఈ భవనం మిలిటరీ స్థావరానికి 150 మీటర్ల దూరంలో ఉందని, రాష్ట్రపతి నిలయం భద్రతా విషయంలో సమస్యలు తలెత్తవని ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇచ్చిందని సత్యనారాయణ తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరఫున తెలంగాణ ఆంధ్రా సబేరియా హెడ్‌క్వార్టర్స్‌కు లేఖ పంపిస్తే, తాము భద్రతాపరమైన అంశాలను పరిశీలిస్తామని బ్రిగేడియర్‌ సూచించారు.
సదుపాయాల కల్పనకు..: బోర్డు పరిధిలో టిమ్స్‌ నిర్మిస్తున్నందున ఆ పరిసరాలలో బోర్డు తరఫున సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని సీఈవో తెలిపారు. ఇందుకు బెట్టర్‌మెంట్‌ ఛార్జీల కింద గృహ సముదాయాలకు చదరపు మీటరుకు రూ.700 చొప్పున వసూలు చేస్తున్నామని, ప్రభుత్వం ప్రజల సంక్షేమార్థం ఆసుపత్రి నిర్మిస్తున్నందున రూ.500 తీసుకోవాలని ఆదేశించారు.

బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం

2023-24ఆర్థిక సంవత్సరానికి గతంలో రూ.285.66కోట్లతో రూపొందించిన ప్రతిపాదనల్లో సవరణలు చేసి రూ.322.23కోట్లకు బోర్డు ఆమోదించింది. 2024-25ఆర్థిక సంవత్సరానికి రూ.337.77కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనను ఆమోదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని