logo

నాంపల్లి కోర్టులో రౌడీషీటర్‌ వీరంగం

నాంపల్లి కోర్టులో ఓ రౌడీషీటర్‌ వీరంగం సృష్టించాడు. తనను రిమాండ్‌ చేయొద్దని.. ఏకంగా కోర్టు హాల్‌లోనే తలుపు అద్దాలు పగులగొట్టి నానా హంగామా సృష్టించాడు.

Published : 02 Jun 2023 03:11 IST

జైలుకెళ్లనంటూ మారాం.. కోర్టులో కిటికీ అద్దాలు పగులగొట్టి హంగామా

ఆనంద్‌ అగర్వాల్‌

నాంపల్లి, అబిడ్స్‌, న్యూస్‌టుడే: నాంపల్లి కోర్టులో ఓ రౌడీషీటర్‌ వీరంగం సృష్టించాడు. తనను రిమాండ్‌ చేయొద్దని.. ఏకంగా కోర్టు హాల్‌లోనే తలుపు అద్దాలు పగులగొట్టి నానా హంగామా సృష్టించాడు. నాంపల్లి, శాలిబండ ఇన్‌స్పెక్టర్లు రాజునాయక్‌, బి.సైద కథనం ప్రకారం..లాల్‌దర్వాజ మేకలబండ ప్రాంతానికి చెందిన కె.ఆనంద్‌ అగర్వాల్‌(27)ను శాలిబండ పోలీసులు బుధవారం గంజాయి కేసులో అరెస్టు చేసి, 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం నిందితుడిని శాలిబండ పోలీసులు నాంపల్లి క్రిమినల్‌ కోర్టుల ప్రాంగణంలోని 16వ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకు తరలిస్తుండగా.. తనను రిమాండ్‌ చేయవద్దని, తాను జైలుకు వెళ్లనంటూ హంగామా చేశాడు. అయినప్పటికీ పోలీసులు బలవంతంగా కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తుండగా కోపంతో ఏకంగా కోర్టు హాల్‌ పోర్టికో వద్ద ఉన్న తలుపు అద్దాలను చేతితో పగులగొట్టడంతో చేతికి గాయాలయ్యాయి. ఈ విషయం న్యాయమూర్తి దృష్టికి కూడా వెళ్లింది. అతికష్టంపై పోలీసులు అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి సదరు నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం పోలీసులు అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

జైలుకెళ్లొచ్చినా మారని ప్రవర్తన

ఆనంద్‌అగర్వాల్‌ పెద్ద పేరుమోసిన రౌడీషీటర్‌. ఇప్పటికే 18 కేసుల్లో నిందితుడు. మరో నాలుగు దొంగతనాల కేసుల్లో ఇదివరకే శిక్ష అనుభవించాడని పోలీసులు వివరించారు. నెల రోజుల క్రితమే హత్య కేసులో జైలుకెళ్లి విడుదలై.. మళ్లీ గంజాయి విక్రయాల కేసులో పట్టుబడ్డాడు. తనపై ఉన్న రౌడీషీట్‌ను మాదన్నపేట్‌ ఠాణాకు మారుస్తున్నామని, సంతకం చేసేందుకు రావాలని శాలిబండ పోలీసులు తనను బుధవారం  పిలిస్తే తన భార్యతో కలిసి వెళ్లానని, కానీ పోలీసులు తనను లాకప్‌లో కూర్చోబెట్టడంతో వదిలేయమని ప్రాధేయపడ్డా పోలీసులు వినిపించుకోలేదంటూ ఆనంద్‌అగర్వాల్‌, అతడి భార్యగా చెప్పుకుంటున్న ఓ యువతి ఆరోపించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని