logo

ఖరీదైన కార్లలో గుప్పుగుప్పు

ఖరీదైన కార్లలో గుట్టుగా గంజాయి తరలిస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హయత్‌నగర్‌ పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, ఏపీలోని రంపచోడవరం నుంచి మహారాష్ట్రకు ఈ ముఠా తరచూ సరకు చేరవేస్తోంది.

Published : 02 Jun 2023 03:11 IST

గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా
450 కిలోల సరకు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న నిందితులు

గంజాయిని పరిశీలిస్తున్న కమిషనర్‌ డీఎస్‌  చౌహాన్‌, డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు

ఈనాడు- హైదరాబాద్‌: ఖరీదైన కార్లలో గుట్టుగా గంజాయి తరలిస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హయత్‌నగర్‌ పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు, ఏపీలోని రంపచోడవరం నుంచి మహారాష్ట్రకు ఈ ముఠా తరచూ సరకు చేరవేస్తోంది. తాజాగా 450 కిలోల గంజాయిని ఇన్నోవా కారులో తరలిస్తున్న ఇద్దరిని గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. రూ.1.2 కోట్ల విలువైన గంజాయి, ఇన్నోవాకారు, రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ హెచ్‌.వెంకటేశ్వర్లుతో కలిసి రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ గురువారం కేసు వివరాలు వెల్లడించారు.

డబ్బుపై ఆశతో స్మగ్లింగ్‌

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ బాబూమియా షేక్‌(39) కారు డ్రైవర్‌. అడ్డదారిలో సంపాదించేందుకు అలవాటుపడ్డ ఇతను గంజాయి స్మగ్లర్‌ అవతారమెత్తాడు. ఏపీలోని రంపచోడవరానికి చెందిన గంజాయి వ్యాపారి ధనుతో సంబంధాలు పెంచుకుని.. తరచూ మహారాష్ట్రకు సరకు రవాణా చేస్తుంటాడు. అడ్డొస్తే ఎదుటివారిపై దాడి చేసేందుకూ వెనుకాడడు. కారులో ఎప్పుడూ ఇనుపరాడ్డు ఉంచుకుంటాడు. ఇతనిపై పటాన్‌చెరులో గతంలో మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించి ఓ కేసు ఉంది. రంపచోడవరంలో కిలో గంజాయి రూ.2వేలకు కొని మహారాష్ట్రకు తీసుకెళ్లి ఉస్మానాబాద్‌కు చెందిన సతీశ్‌ జాదవ్‌, సుభాశ్‌ జాదవ్‌, బాబు కాలేకు కిలో రూ.10వేల చొప్పున అమ్ముతాడు. వీరంతా స్థానిక స్మగ్లర్లకు కిలో రూ.20వేల చొప్పున అమ్మేస్తారు. తాజాగా బాబూమియాకు 450 కిలోల సరకు తేవాలంటూ ఆర్డర్‌ వచ్చింది. తనకు సాయం చేసేందుకు బీడ్‌ జిల్లాకు చెందిన తాపీ మేస్త్రీ షేక్‌ అజాజ్‌ సికిందర్‌(27)ని కమీషన్‌ ఆశజూపి బాబూమియా తన వెంట తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి మహారాష్ట్ర నుంచి ఇన్నోవా కారులో రంపచోడవరం వెళ్లారు. అక్కడ గంజాయి వ్యాపారి ధను దగ్గర 450 కిలోల సరకు కొని తిరిగి వస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని