logo

వేలిముద్రల ప్రొఫెసర్లు

అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం.. పరిశ్రమలకవసరమైన మానవ వనరులను విద్యాసంస్థల్లో తీర్చిదిద్దుతున్నామంటూ చెబుతున్న జేఎన్‌టీయూ ఉన్నతాధికారుల మాటలు నీటిమూటలయ్యాయి.

Updated : 03 Jun 2023 05:20 IST

జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలో ఎన్ని సిత్రాలో
తూతూమంత్రంగా నిజ నిర్ధరణ కమిటీ తనిఖీలు

 

అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం.. పరిశ్రమలకవసరమైన మానవ వనరులను విద్యాసంస్థల్లో తీర్చిదిద్దుతున్నామంటూ చెబుతున్న జేఎన్‌టీయూ ఉన్నతాధికారుల మాటలు నీటిమూటలయ్యాయి. జేఎన్‌టీయూ పరిధిలోని 214 అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలకుగాను 40 శాతం కళాశాలల్లో ‘వేలిముద్రల’ ప్రొఫెసర్లే ఎక్కువమంది ఉన్నారు. వీరు బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేసి వెళ్లిపోతారు. తరగతులు చెప్పరు. అనుబంధ హోదాను (అఫిలియేషన్‌) కాపాడుకునేందుకు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎంటెక్‌, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారి విద్యార్హతలను కొంటున్నాయి. నిజ నిర్ధరణ కమిటీ తనిఖీల్లో ఇవన్నీ బహిర్గతం కావడం లేదు. ఫలితంగా ఈ ఏడాది బీటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 16 వేల మంది ఫెయిలయ్యారు.

రికార్డుల్లో గరిష్ఠ వేతనాలు..

కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బోధన సక్రమంగా లేదు. డిమాండ్‌ ఉన్న కోర్సులు, అత్యుత్తమ ఫ్యాకల్టీ, త్వరలో అటానమస్‌ (స్వయం ప్రతిపత్తి) వస్తుందనే ప్రచారంతో ఆకర్షిస్తున్నారు. డొనేషన్ల పేరుతో రూ.కోట్లు సంపాదించుకుంటున్నారు. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లను, సహ, సహాయ ఆచార్యులను నియమించుకోవడం లేదు.

* ప్రొఫెసర్లుగా వర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పదవీ విరమణ చేసిన వారిని, కళాశాల కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా చేరినవారికి మాత్రమే రూ.70 వేల-రూ.లక్ష జీతం ఇస్తున్నారు.

* సహ ఆచార్యులుగా పనిచేస్తున్నవారికి యూజీసీ పేస్కేల్‌ ప్రకారం ఇస్తున్నామంటూ వారికి ఆ మేరకు జీతాలు చెల్లిస్తున్నామని రికార్డుల్లో చూపుతున్నారు. వారి ఏటీఎం కార్డులను యాజమాన్య ప్రతినిధులు తమ వద్దే ఉంచుకుని ఖాతాల్లో అధిక జీతం జమ చేసి ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసి రూ.50 వేలిచ్చి మిగిలిన మొత్తాన్ని తీసేసుకుంటున్నారు.

* ఎంటెక్‌, పీహెచ్‌డీ సర్టిఫికెట్లు ఇస్తే చాలు నెలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల జీతం ఇస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలి. ఒక్కరోజు వేలిముద్ర వేయకపోతే ఆరోజు జీతం కట్‌.

అక్రమాలు ఇలా..

* ఉన్నత విద్యామండలి కార్యాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్లు లేరు. కంప్యూటర్‌ సైన్స్‌లో సహాయ ప్రొఫెసర్లున్నట్టు హాజరు పట్టీలో ఉంటాయి. ఆ ప్రొఫెసర్లు బయోమెట్రిక్‌లో వేలిముద్రలు వేసి కళాశాలలో సాయంత్రం వరకూ ఉండి మళ్లీ వేలిముద్రలు వేసి వెళ్తున్నారు.

* పంజాగుట్ట-ఖైరతాబాద్‌-ఆబిడ్స్‌ మార్గంలో ఉన్న పురాతన ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం ప్రతినిధులు ఎంటెక్‌ పూర్తిచేసిన వారికి నెలకు రూ.18 వేలు ఇస్తూ ఉదయం, సాయంత్రం వేలిముద్రలు వేయించి పంపుతున్నారు.

* హైదరాబాద్‌ శివారులోని పర్యాటక ప్రాంతానికి, ఖరీదైన రిసార్టుకు సమీపంలోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు లేరు. యాజమాన్యాలు సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పీజీ చేసిన వారికి రూ.70 వేలు జీతం ఇస్తున్నట్టు రికార్డుల్లో చూపించి వారికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఇస్తున్నారు.

* జేఎన్‌టీయూకు 15 కిలోమీటర్ల పరిధిలో 4 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి ప్రమాణాలకనుగుణంగా విద్యార్థుల ప్రొఫెసర్ల నిష్పత్తి లేదు. ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తిచేసినవారే ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని