logo

Odisha Train Accident: ఊపిరి పీల్చుకున్న హైదరాబాద్‌

రాజధాని నగరం ఊపిరి పీల్చుకుంది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో శనివారం రాత్రి వరకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు అందిన సమాచారం మేరకు హైదరాబాద్‌ చుట్టుపక్కలవారు కోరమండల్‌, హౌరా మెయిల్‌లో ప్రయాణించలేదని అధికారులు తేల్చారు.

Updated : 04 Jun 2023 08:00 IST

 ఒడిశా రైలు ప్రమాదంలో నగరవాసులు లేరన్న అధికారులు
పలు రైళ్ల రద్దు, ఆలస్యంతో ప్రయాణికుల ఇబ్బందులు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రం వద్ద రద్దీ

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి- రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: రాజధాని నగరం ఊపిరి పీల్చుకుంది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో శనివారం రాత్రి వరకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు అందిన సమాచారం మేరకు హైదరాబాద్‌ చుట్టుపక్కలవారు కోరమండల్‌, హౌరా మెయిల్‌లో ప్రయాణించలేదని అధికారులు తేల్చారు. హైదరాబాద్‌కు చెందిన అవినాష్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారని అతనికి కాలువిరిగితే కటక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగినా.. దీనిపై అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రమాదం జరిగిన రెండు రైళ్లు తెలంగాణ రాష్ట్ర రూట్లలో ప్రయాణించేవి కాదు కాబట్టి ఇక్కడివారు ఈ రైలు ఎక్కే అవకాశం ఉండదని అధికారులు అభిప్రాయపడ్డారు.

అంతా గందరగోళమే

రైలు ప్రమాదం నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. పలు రైళ్లను అధికారులు రద్దు చేయడం, ఏ రైళ్లు బయల్దేరుతాయో, చివరి నిమిషాల్లో వేటిని నిలిపివేస్తారో తెలియక తెలుసుకునేందుకు రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు రావడంతో స్టేషన్‌ ఆవరణ కిటకిటలాడింది.
* రైల్వే ఉద్యోగుల దగ్గరా పూర్తి సమాచారం లేకపోవడంతో వారూ ఏమి చెప్పలేకపోయారు. సాయంత్రం వరకు చెబుతామంటూ కాలయాపన చేశారు.* శనివారం ఉదయం, సాయంత్రం బయలుదేరాల్సిన ఈస్ట్‌కోస్ట్‌ షాలిమార్‌, ఫలక్‌నుమా రైళ్లను రద్దుచేశారు. రద్దీగా ఉండే ప్రధాన రైళ్లు కావడంతో  ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. సికింద్రాబాద్‌ రావాల్సిన మూడు రైళ్లను కూడా రద్దు చేశారు. గౌహతి ఎక్స్‌ప్రెస్‌ రైలు 2 గంటల ఆలస్యంగా నడిచింది.
* సాయంత్రం విశాఖపట్నం, గౌహతి, ఇతర రైళ్లకు సంబంధించిన ప్రయాణికులందరూ ఒకేసారి స్టేషన్‌కు వచ్చి ఉండటంతో ఒకటో నంబరు ప్లాట్‌ఫాం కిక్కిరిసిపోయింది. * సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకునే ముందు అవుటర్‌లో రైళ్లను దాదాపు అరగంటకు పైగా నిలిపివేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు