logo

నాసి.. నిఘాతో నుసి

ఏరువాక పౌర్ణమి ఆరంభంతో అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో రైతుల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని నకిలీ (నాసి రకం) విత్తనాలు, పురుగు మందులు మార్కెట్లోకి ముంచెత్తనున్నాయి.

Published : 07 Jun 2023 04:11 IST

టాస్క్‌ ఫోర్స్‌ కమిటీల ముమ్మర తనిఖీలు

దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌: ఏరువాక పౌర్ణమి ఆరంభంతో అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో రైతుల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని నకిలీ (నాసి రకం) విత్తనాలు, పురుగు మందులు మార్కెట్లోకి ముంచెత్తనున్నాయి. ఇప్పటికే పలుచోట్ల నాసిరకం విత్తనాలను పోలీసులు తనిఖీల్లో గుర్తించారు. మరింత కట్టడి చేసేందుకు వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

కేసుల నమోదు షురూ..

దాదాపు 20 రోజుల క్రితం నుంచే ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలోనే నకిలీలను అరికడితే రైతుల చెంతకు చేరకుండా ఉంటాయని భావించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు. వికారాబాద్‌, తాండూరు, బషీరాబాద్‌ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి నాలుగు కేసులు నమోదు చేశారు.

* జిల్లా స్థాయిలో ఎస్పీ, జిల్లా వ్యవసాయాధికారితో, సబ్‌ డివిజన్‌ స్థాయిలో మరో మూడు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు పనిచేస్తున్నాయి. సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యాపారుల గోదాములు తనిఖీ చేస్తున్నారు.

పత్తి విత్తనాలే ఎక్కువ

జిల్లాలో ఎక్కువగా నకిలీ పత్తి విత్తనాలే మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. పొరుగు జిల్లాల్లోనూ నకిలీ విత్తనాలు దుకాణాల్లో దొరుకుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

* గతంలో నకిలీ విత్తనాలకు సంబంధించి 12కేసులు నమోదయ్యాయి. వీటిలో అధికంగా కొడంగల్‌, తాండూరు ప్రాంతాల్లోనే ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం సమీపాన ఉండటంతో అక్కడి నుంచి జిల్లాలోకి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పరిగిలోనూ నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి.  


పునరావృతమైతే పీడీ చట్టం

ఎన్‌.కోటిరెడ్డి, జిల్లా ఎస్పీ

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు సమర్థంగా పనిచేస్తున్నాం. ఈక్రమంలోనే ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశాం. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి రాకుండా ఉండేందుకు నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. ఇవే కేసులు పునరావృతమైతే పీడీ చట్టం ప్రయోగిస్తాం.  


కొనుగోళ్లలో జాగ్రత్తలు తప్పనిసరి

గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలి. లైసెన్స్‌ కలిగిన డీలరు వద్ద నుంచే కొనుగోలు చేసి రసీదును భద్రపరుచుకోవాలి. ఇందుకు ఏఈఓల సహకారం నిరంతరం ఉంటుంది. కొత్త వ్యక్తులు విత్తనాల విషయం గురించిన ప్రస్తావన తీసుకువస్తే సమీప వ్యవసాయాధికారికి లేదా పోలీసు స్టేషన్లకు సమాచారం ఇవ్వండి.


మొత్తం రైతులు..2,44,650
ఖరీఫ్‌ సాధారణ సాగు 5,83,317 ఎకరాలు
కావాల్సిన ఎరువులు..75000 మెట్రిక్‌ టన్నులు
ప్రధాన పంటలు..పత్తి, వరి, కంది, మొక్కజొన్న


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని