logo

విద్యాసంస్థల్లో ధ్రువపత్రాలు.. పాస్‌పోర్ట్‌కు తిప్పలు

ఉప్పల్‌కు చెందిన రమేశ్‌ బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థి. కళాశాల పూర్తయ్యేలోపు పాస్‌పోర్టు చేతికొస్తుందని భావించి జనవరి మొదటివారంలో సాధారణ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశాడు. ఫిబ్రవరి నెలాఖరులో స్లాట్‌ లభించింది.

Published : 07 Jun 2023 04:11 IST

కస్టోడియన్‌ సర్టిఫికెట్‌ లేకపోవడంతో తిప్పి పంపుతున్న అధికారులు

ఉప్పల్‌కు చెందిన రమేశ్‌ బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థి. కళాశాల పూర్తయ్యేలోపు పాస్‌పోర్టు చేతికొస్తుందని భావించి జనవరి మొదటివారంలో సాధారణ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశాడు. ఫిబ్రవరి నెలాఖరులో స్లాట్‌ లభించింది. పదో తరగతి ఒరిజినల్‌ ధ్రువపత్రం సమర్పించకపోవడంతో దరఖాస్తు ప్రాసెసింగ్‌ను అధికారులు తిరస్కరించారు. జూన్‌లో రావాలని బోనఫైడ్‌, కస్టోడియన్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని అధికారులు సూచించారు. కానీ జూన్‌లో వెళ్లి బోనఫైడ్‌ ఇచ్చి కస్టోడియన్‌ ధ్రువపత్రం ఇవ్వకపోవడంతో అధికారులు దరఖాస్తు ప్రక్రియను ఆపేసి మరోసారి రమ్మని చెప్పడంతో అవాక్కయ్యాడు. జూన్‌ వరకు దరఖాస్తు ప్రక్రియే పూర్తికాకపోవడంతో పాస్‌పోర్టు చేతికొచ్చే సరికి ఇంకెంత ఆలస్యమవుతుందని ఆందోళన చెందుతున్నాడు.

అకడమిక్‌ సంవత్సరంలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తిప్పలు తప్పడం లేదు. జనన ధ్రువీకరణ, అకడమిక్‌ ధ్రువపత్రాలు కళాశాలల్లో ఉండటంతో వాటికిప్రత్యామ్నాయ పత్రాలు తీసుకురాకపోవడం, కస్టోడియన్‌ సర్టిఫికెట్‌ సమర్పించక నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కళాశాలలు కస్టోడియన్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, కేవలం బోనఫైడ్‌ ఇవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.

అసలేంటీ కస్టోడియన్‌  సర్టిఫికెట్‌..

విద్యార్థులు చదివే కళాశాల ప్రిన్సిపల్‌ ఈ కస్టోడియన్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. విద్యార్థి సదరు కళాశాలలో చదువుతున్నారని, అతని ధ్రువపత్రాలు తమ వద్దే భద్రంగా ఉన్నాయని చెప్పే ఓ అధికారిక పత్రమే కస్టోడియన్‌ సర్టిఫికెట్‌. విద్యార్థులు కళాశాలలో చేరే ముందు వీటిని జారీ చేస్తారు. కానీ కొన్ని కళాశాలలు ఈ విషయాన్ని విస్మరిస్తున్నాయి. అడిగినప్పుడు చూద్దాంలే అని విస్మరిస్తుండటం, విద్యార్థులకు దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడంతో పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తొందరపడితే.. చిక్కులే

విద్యాసంవత్సరంలో అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారికి కొత్త సమస్య ఎదురవుతోంది. సర్టిఫికెట్ల సమర్పణలో జాప్యం, విదేశాలకు వెళ్లే తేదీ దగ్గర పడుతుండటంతో కొందరు నిరక్షరాస్యులు, పదోతరగతి పాస్‌ అయిన ధ్రువపత్రాలు లేనివారు తీసుకునే ఎమ్మిగ్రేంట్‌ చెక్‌ రిక్వైర్డ్‌(ఈసీఆర్‌)  పాస్‌పోర్టు తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో విదేశాల్లో ఉద్యోగానికి తర్వాత వెళ్లాలంటే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లేవారికి ఎమ్మిగ్రెంట్‌ చెక్‌ నాట్‌ రిక్వైర్డ్‌ (ఈసీఎన్‌ఆర్‌) పాస్‌పోర్టును జారీ చేస్తారు.

ఏఆర్‌ఎన్‌లోనే అన్ని వివరాలు..

పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడే వచ్చే అప్లికేషన్‌ రిఫరెన్స్‌ నంబర్‌ (ఏఆర్‌ఎన్‌) ధ్రువపత్రంలో 40 సూచనలు చదివి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు https://passportindia.gov.in/AppOnlineProject/pdf/ApplicationformInstructionBookletV3.0.pdf వెబ్‌సైట్‌లో వివరాలను పరిశీలించాలని సూచించారు.

ఈనాడు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు