logo

వారంలో బడులు.. బస్సుల తనిఖీలెప్పుడు?

వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా చాలా బడుల బస్సులు ఫిట్‌నెస్‌కు నోచుకోవడం లేదు. గత నెల 15న ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అరకొరగా ఫిట్‌నెస్‌ పొందినట్లు తెలుస్తోంది.

Updated : 07 Jun 2023 05:50 IST

ఫిట్‌నెస్‌ పరీక్షలకు ముందుకు రాని యాజమాన్యాలు

ఈనాడు, హైదరాబాద్‌: వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా చాలా బడుల బస్సులు ఫిట్‌నెస్‌కు నోచుకోవడం లేదు. గత నెల 15న ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అరకొరగా ఫిట్‌నెస్‌ పొందినట్లు తెలుస్తోంది. గతేడాది బడులు ప్రారంభమైన తర్వాత కూడా 1500 వరకు బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగా ఉన్నట్లు రవాణాశాఖ గుర్తించి నోటీసులు నోటీసులు జారీ చేసింది. ఏటా విద్యాసంస్థల ప్రారంభానికి ముందు ప్రతి బస్సు ఫిట్‌నెస్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి.

గ్రేటర్‌వ్యాప్తంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌ తదితర చోట్ల మొత్తం 10-12 వేలకుపైగా పాఠశాలలు, కళాశాలల బస్సులు తిరుగుతున్నాయి. జూన్‌ 12న పాఠశాలలు తెరిచేలోపు ప్రతి బస్సు సంబంధిత రవాణాశాఖ వద్ద సామర్థ్య పరిశీలన చేసుకొని ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఫిట్‌నెస్‌ టెస్టు సందర్భంగా  బ్రేకులు, టైర్లు, అత్యవసర ద్వారాలు, డ్రైవర్‌ ఆరోగ్యం, బీమా, కాలుష్య నియంత్రణ తదితర విషయాలను అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతుందనే ఆరోపణలున్నాయి.  కొందరు ఆర్టీఏ సిబ్బంది డబ్బు తీసుకొని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.


ఆటోమేటిక్‌  కేంద్రాల జాడేది..?

వాహనాల ఆటోమేటిక్‌ ఫిట్‌నెస్‌ పరిశీలన కోసం గతంలో చౌటుప్పల్‌ వద్ద అధునాతన కేంద్రం ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. సిబ్బందితో అవసరం లేకుండా కంప్యూటర్‌ ఆధారితంగా తీర్చిదిద్దాలని యోచించారు. స్థల వివాదంతో ఆ పనులు నిలిచిపోయాయి. దీంతో ఏటా సిబ్బంది ఆధ్వర్యంలో ఫిట్‌నెస్‌ తనిఖీలు జరుగుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు వ్యాన్లు, ఆటోల్లో పిల్లలను స్కూళ్లకు పంపుతుంటారు. కొందరు మాఫియాగా  ఏర్పడి మినీ వ్యాన్లు నడుపుతున్నారు. సిండికేట్‌గా మారి ధరలు నిర్ణయిస్తున్నారు. ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టాల్సిన వ్యానులో 10-12 మందిని కుక్కుతున్నారు. వీటిలో చాలా వ్యాన్లు ఫిట్‌నెస్‌ లేకుండా తిరుగుతున్నాయి. ఈ విషయంపై హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు అధికారి పాండురంగనాయక్‌ మాట్లాడుతూ పాఠశాల బస్సులు, మినీ వ్యాన్లు ఈ నెల 12లోపు ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ తీసుకోవాలన్నారు. లూదంటూ 12 నుంచి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి కేసులు నమోదు చేస్తామన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని