logo

Software Engineer: బావ మరిదికి వీడ్కోలు పలికేందుకు వెళ్లి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

పెళ్లై నెలరోజులు తిరగకముందే ఓ నవ వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

Updated : 07 Jun 2023 09:52 IST

ఆదిభట్ల, న్యూస్‌టుడే: పెళ్లై నెలరోజులు తిరగకముందే ఓ నవ వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివాహానికి వచ్చిన బావమరిదికి వీడ్కోలు చెప్పేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న క్రమంలో ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్‌, కేశవనగర్‌లోని ఎస్వీ బృందావన్‌లో నివాసం ఉండే ప్రైవేట్‌ లెక్చరర్లు మురళీధర్‌, సుచరిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చిరు హర్షిద్‌(26)  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇతనికి గతనెల 10న వివాహమైంది. పెళ్లికి విదేశాల నుంచి వచ్చిన బావమరిదిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దింపడానికి మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఇంటినుంచి కారులో బయలుదేరాడు. చిరు హర్షిద్‌ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఏడు గంటల సమయంలో బొంగుళూరు దాటి రావిర్యాల వద్దకు రాగానే ముందున్న ఓ కారు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. ఈ క్రమంలో ఆ వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు స్తంభానికి చిరు హర్షిద్‌ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. అతని బావమరిదికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని