logo

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసి విద్యార్థి బలవన్మరణం

కుమారుడు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూడాలని భావించారు. కొడుకు చదువుల్లో రాణిస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోయారు.

Published : 09 Jun 2023 02:10 IST

కేపీహెచ్‌బీ కాలనీ: కుమారుడు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూడాలని భావించారు. కొడుకు చదువుల్లో రాణిస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. ఆ ఆనందం మధ్యలోనే ఆవిరైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసిన ఓ విద్యార్థి ఐదు రోజుల కిందట రైలు కింద పడి చనిపోయాడు. నాంపల్లి రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, యువకుడి మామయ్య వివరాల ప్రకారం.. కుమురంభీం జిల్లా అనార్‌పల్లికి చెందిన సచిన్‌ రాథోడ్‌(19) ఇంటర్‌ పూర్తి చేశాడు. జేఈఈ మెయిన్స్‌లో 91 శాతం మార్కులు సాధించాడు. ఈ నెల 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు 3వ తేదీనే మిత్రులతో కలిసి హైదరాబాద్‌ వచ్చాడు. మరుసటి రోజు పరీక్ష బాగా రాయలేదని తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. అదేరోజు రాత్రి ఓ హోటల్‌లో భోజనం చేసి హైటెక్‌ సిటీ- హఫీజ్‌పేట ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. లోకో పైలెట్‌ సమాచారంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వివరాలు లభించకపోవడంతో రైల్వే ఇన్‌స్పెక్టర్‌ కేపీహెచ్‌బీ ఎస్‌హెచ్‌వో కిషన్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 8న సచిన్‌ రాథోడ్‌ కనిపించడం లేదని అతని మామయ్య కేపీహెచ్‌బీ ఎస్‌హెచ్‌వోని సంప్రదించారు. నాంపల్లి రైల్వే పోలీసుల వద్దకు వెళ్లమని సూచించడంతో యువకుడి వివరాలు లభించాయి. అదే రోజు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని