logo

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం

వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు శంకర్‌పల్లి సీఐ ప్రసన్నకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 09 Jun 2023 02:10 IST

మృతులు రాంచంద్రారెడ్డి,   యుగేంధర్‌

శంకర్‌పల్లి, కేశంపేట, శంషాబాద్‌, ఇబ్రహీంపట్నం, మంచాల, న్యూస్‌టుడే: వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు శంకర్‌పల్లి సీఐ ప్రసన్నకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారానికి చెందిన లావోజి రాంచంద్రారెడ్డి(65) ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ విశ్రాంత ఉద్యోగి. శంకర్‌పల్లిలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం పొలానికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా షుగర్‌ ఫ్యాక్టరీ మలుపు వద్ద కారు ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా ఢీకొట్టింది. రాంచంద్రారెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మరో ఘటనలో పురపాలికలోని బుల్కాపురం గ్రామానికి చెందిన మల్కపురం నర్సింలు(55) మధ్యాహ్నం శంకర్‌పల్లి సోసైటీ బ్యాంకులో డబ్బులు తీసుకునేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. బ్యాంకు సమీపంలో లారీ డ్రైవరు అజాగ్రత్తగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. కింద పడ్డ ఆయన పైనుంచి లారీ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
బైకును స్కూటీ ఢీకొట్టడంతో.. కల్వకుర్తి మండలం జేపీనగర్‌ తండాకు చెందిన పాత్లావత్‌ యుగేంధర్‌ (21) తన స్నేహితుడు తలకొండపల్లికి చెందిన నవీన్‌తో కలిసి స్కూటీపై ఉదయం షాద్‌నగర్‌కు బయలుదేరారు. గాంధీశంకర్‌పల్లి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టారు. స్కూటీపై వెనుక కూర్చొన్న యుగేంధర్‌ కిందపడగా.. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై ధనుంజయ తెలిపారు. నవీన్‌రెడ్డికి గాయపడ్డాడన్నారు.
ఔటర్‌పై ట్రక్కు బోల్తాపడి.. మహారాష్ట్ర, లాతూర్‌కు చెందిన అనిల్‌(32) ట్రక్కు డ్రైవర్‌ . అదే ప్రాంతానికి చెందిన కమలాకర్‌తో కలిసి గుంటూరు వెళ్లాడు. ట్రక్కులో జొన్నల బస్తాలు నింపుకొని ఔటర్‌ మీదుగా ముంబయికి బయల్దేరాడు. గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌ చిన్నగోల్కొండ సమీపంలోకి రాగానే ట్రక్కు బోల్తాపడింది. డ్రైవర్‌ అనిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన కమలాకర్‌ను ఆసుపత్రికి తరలించారు.
నిలిపిఉన్న లారీని ఢీకొన్న బైకు.. నిలిపిఉన్న లారీని బైకు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మంచాల ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ కథనం ప్రకారం.. మంచాల మండలం సత్తితండాకు చెందిన రామావత్‌ చంటి(20), నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎల్గపల్లికి చెందిన సాయిచరణ్‌(15), మర్రిగూడకు చెందిన కేతావత్‌ సిద్దు కలిసి గురువారం లోయపల్లి నుంచి సత్తితండాకు బైకుపై వస్తున్నారు. అంబోత్‌తండా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో చంటి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిచరణ్‌ ఇబ్రహీంపట్నం ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని