logo

భూసేకరణ చేయలేక.. చెట్ల నరికివేత

రోడ్డు విస్తరణకు బల్దియా అధికారులు భూసేకరణ చేపట్టలేకపోయారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రహదారి పక్కనున్న ఏళ్ల నాటి చెట్లను వేర్లతో సహా పెకలించారు.

Published : 10 Jun 2023 01:42 IST

హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌-సైబర్‌టవర్స్‌ రోడ్డుపై నిర్వాకం
కాలిబాటపై రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక
పోలీసుల ఒత్తిడే కారణమంటోన్న జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు విస్తరణకు బల్దియా అధికారులు భూసేకరణ చేపట్టలేకపోయారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రహదారి పక్కనున్న ఏళ్ల నాటి చెట్లను వేర్లతో సహా పెకలించారు. పచ్చదనానికి సమాధి కట్టారు. ఇప్పుడు ఆ కాలిబాటను రోడ్డుగా మార్చబోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ నుంచి సైబర్‌ టవర్స్‌ వరకు ఉన్న రోడ్డులో చోటుచేసుకున్న దారుణమిది. పెరిగిన ట్రాఫిక్‌ సమస్యకు రోడ్డు విస్తరణే పరిష్కారమైనా.. చట్టబద్ధమైన విధానాన్ని పాటించలేదు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కలిసి కిందిస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి పెంచి, చెట్ల నరికివేత చేపట్టారని జీహెచ్‌ఎంసీ వాపోయింది.

హైటెక్‌సిటీలో ‘అధికార’ యుద్ధం..

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ) కింద హైటెక్‌సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ పెద్దఎత్తున రోడ్లను అభివృద్ధి చేసింది. సుమారు రూ.700 కోట్ల పనులను పూర్తి చేయగా మరిన్ని పురోగతిలో ఉన్నాయి. అయినప్పటికీ ట్రాఫిక్‌ సమస్య యథాతథం. ముఖ్యంగా 6 ప్రాజెక్టులు పూర్తయిన జేఎన్‌టీయూ-బయోడైవర్సిటీ కూడలి కారిడార్‌లో తలెత్తుతోన్న సమస్యను చర్చించుకోవాలి. ఈ మార్గంలో పలు కూడళ్లున్నాయి. వాటి దగ్గర వాహనాలు నిలవకుండా సాగిపోవాలన్నది ఎస్సార్డీపీ లక్ష్యం. బయోడైవర్సిటీ కూడలిపై 2 పైవంతెనలు, మైండ్‌స్పేస్‌ కూడలిపై పైవంతెన, అండర్‌పాస్‌, అయ్యప్ప సొసైటీ కూడలిలో అండర్‌పాస్‌, హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ వద్ద ఆర్‌యూబీ, ఆర్‌ఓబీ, జేఎన్‌టీయూ నుంచి మలేషియన్‌ టౌన్‌షిప్‌ వరకు పొడవైన పైవంతెనలు నిర్మాణమయ్యాయి. కొన్నేళ్ల కిందట సైబర్‌ టవర్స్‌ కూడలిపై నిర్మించిన పైవంతెన గురించి అందరికీ తెలిసిందే. ఇక ట్రాఫిక్‌ సమస్య పేరుతో కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడ పడితే అక్కడ యూటర్న్‌లు అడుగుతున్నారని, అడ్డదిడ్డంగా విభాగినులపై ఉండే చెట్లను నరికించేస్తున్నారని, పైవంతెనల కింద సరైన ఎత్తు లేనిచోట కూడా యూటర్న్‌లు పెడుతున్నారని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లేకుండా ఎన్‌ఐఏ భవనం మూల మలుపులో స్పీడు బ్రేకర్లు వేయాలంటూ తాజాగా పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు.

ఆ రెండు ఆస్తులు సేకరించలేక..

అయ్యప్ప సొసైటీ కూడలి నుంచి హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్డు నిర్మించాలన్నది జీహెచ్‌ఎంసీ లక్ష్యం. అందుకు ఇద్దరు యజమానులు అడ్డుపడ్డారు. వారిలో ఒకరు ఐఆర్‌ఎస్‌ అధికారి కావడంతో జీహెచ్‌ఎంసీ భూసేకరణకు సాహసించలేదనే విమర్శలున్నాయి. ఎలాగైనా రోడ్డు విస్తరించాలనే పోలీసుల ఒత్తిడితో బల్దియా పార్కుల విభాగం సర్కిల్‌ మేనేజరు నరసయ్య నెలక్రితం రాత్రికి రాత్రి కాలిబాట పొడవునా ఉన్న 73 చెట్లను నరికించారని, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు ప్రచారం కావడంతో అటవీశాఖ.. ఆయన్ను సస్పెండ్‌ చేసింది. బాధ్యులైన పోలీసు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను అటవీశాఖ చర్యల నుంచి తప్పించిందని, కిందిస్థాయి అధికారిని బదిలీ చేసి చేతులు దులిపేసుకుందనే విమర్శలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని