logo

వీఆర్‌ఏపై ఇసుక వ్యాపారుల దాడి

ట్రాక్టర్‌ను నెమ్మదిగా పోనివ్వాలని సూచించిన వీఆర్‌ఏపై ఇసుక వ్యాపారులు దాడి చేసి గాయపరిచారు.

Published : 10 Jun 2023 01:42 IST

తాండూరు, తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ను నెమ్మదిగా పోనివ్వాలని సూచించిన వీఆర్‌ఏపై ఇసుక వ్యాపారులు దాడి చేసి గాయపరిచారు. తాండూరు పట్టణంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం పట్టణ సీఐ రాజేందర్‌ తెలిపిన ప్రకారం.. గురువారం రాత్రి పాత తాండూరు నుంచి చెంగేష్‌పూర్‌ వైపు ఫిరోజ్‌ ట్రాక్టర్‌లో ఇసుకను వేగంగా తరలిస్తున్నాడు. వీఆర్‌ఏ ఎల్లప్ప అటుగా వస్తున్న సమయంలో ట్రాక్టర్‌ను నెమ్మదిగా పోనివ్వాలని డ్రైవర్‌ను కోరాడు. ఆ విషయాన్ని ఫిరోజ్‌ ట్రాక్టర్‌ యజమాని అబ్రార్‌కు చెప్పడంతో, ఆయన ట్రాక్టర్‌ వద్దకు వచ్చాడు. నా ట్రాక్టర్‌నే ఆపుతావా అంటూ వీఆర్‌ఏపై దాడి చేసి గాయపరిచారు. వీఆర్‌ఏ అదే రోజు రాత్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అబ్రార్‌, ఫిరోజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  శుక్రవారం ఇదే విషయమై పాతతాండూరువాసులు, వీఆర్‌ఏలు ప్రదర్శనగా తాండూరు తహసీల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. దాడులను, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దారు చిన్నప్పలనాయుడు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కౌన్సిలర్‌ బొబ్బిలి శోభారాణి, ఎర్రంశ్రీధర్‌ ఫిర్యాదు ప్రతులను, అన్నికులసంఘాలు చేసిన తీర్మాన ప్రతులను తహసీల్దారుకు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని