logo

దూరానిన్ని దగ్గర చేద్దామిలా!

ప్రజారవాణాలో ప్రయాణించే వారు పెరగాలంటే గమ్యస్థానం చేరేవరకు రవాణా సదుపాయాలు మెరుగుపడాలి.

Updated : 18 Sep 2023 05:43 IST

గమ్యస్థానం వరకు రవాణా 70   శాతానికి పెరగాలి
ప్రస్తుతం నగరంలో 31 శాతమే..
సౌకర్యాలు మెరుగుపర్చాలంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజారవాణాలో ప్రయాణించే వారు పెరగాలంటే గమ్యస్థానం చేరేవరకు రవాణా సదుపాయాలు మెరుగుపడాలి. ప్రస్తుతం సిటీలో ఈ సౌలభ్యం 31 శాతం మాత్రమే ఉంది. దీన్ని 70 శాతానికి పెంచాలనేది ప్రభుత్వం ఆలోచన. దిల్లీ, బెంగళూరు, నాగ్‌పూర్‌ వంటి నగరాలు గమ్యస్థానం వరకు ప్రయాణికులను చేర్చడంలో మనకంటే ముందున్నాయి. మన దగ్గర ఇప్పటికీ ఈ వ్యవస్థ కుదురుకోలేదు. సైక్లింగ్‌ ప్రాజెక్ట్‌ అటకెక్కింది. కామన్‌ మొబిలిటీ కార్డుతో పాటూ మరెన్నో చేయాల్సి ఉంది. గమ్యస్థానం దగ్గరైనా.. అక్కడిదాకా చేరే మార్గాలు లేక ప్రయాణికులు దూరంగా భావిస్తున్నారు. సౌకర్యాలు మెరుగుపరిస్తే దూరం సైతం దగ్గరవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇతర నగరాల్లో ఇలా...

నాగ్‌పూర్‌ మెట్రోలో ప్రయాణించే వారిలో 70 శాతం నడుచుకుంటూ లేదంటే సైకిల్‌పై స్టేషన్‌ చేరే వారే ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది.

  • దిల్లీ మెట్రోలో ప్రయాణికుల ట్రిప్పుల సంఖ్య ఇటీవల 65 లక్షలు దాటింది. ఇక్కడ 39 శాతం మంది నడుచుకుంటూ మెట్రోవరకు వస్తారు. సైకిల్‌ వినియోగించే వారి సంఖ్య ఎక్కువే. పాదపాటలు, బైక్‌ షేరింగ్‌ సదుపాయలు, చిన్న బస్సులు, ఆటోలను సైతం అనుసంధానంగా నడుపుతున్నారు. ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ఈ-రిక్షా, గ్రామీణ్‌ సేవా వాహనాలు అందుబాటులో ఉన్నాయి.  
  • బెంగళూరులో మెట్రో స్టేషన్ల వరకు 66 శాతం మంది ప్రయాణికులు నడిచి లేదంటే సైకిల్‌పై వస్తున్నారు.

పాదబాటలు...

 

 

ఇంటి నుంచి రెండు మూడువందల మీటర్ల దూరంలోనే రవాణా సదుపాయం అందుబాటులో ఉండాలి. అక్కడి వరకూ చేరుకునేందుకు నడక మార్గాలను అడ్డంకులు లేకుండా అందుబాటులోకి తీసుకురావాలి. సిటీలో ప్రధాన రహదారుల్లో పాదబాటలు ఆక్రమణల్లో ఉన్నాయి. చర్యలు తీసుకోవాలి.


సైక్లింగ్‌ ట్రాక్‌లు..

కిలోమీటర్‌ నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు సైకిల్‌పై వెళ్లేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నా... రహదారులపై ప్రత్యేక దారి లేక ఇబ్బంది పడుతున్నారు. తొలుత పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లోనైనా ప్రత్యేకంగా ట్రాక్‌ వేయాలి.సైకిల్‌ షేరింగ్‌ను ప్రోత్సహించాలి. సైకిళ్లు నిలిపేందుకు సదుపాయాలు కల్పించాలి.


తక్కువ ధరలో..

మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్‌స్టేషన్లు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడి వరకు అందుబాటు ధరల్లో ఆటో సౌలభ్యం ఉండాలి. ప్రస్తుతం కొన్ని సంస్థలు ఎలక్ట్రిక్‌ ఆటోలను నడుపుతున్నాయి. ఇవి మరింతగా అందుబాటులోకి రావాలి. ధరలు ఇష్టారీతిగా వసూలు చేయకుండా.. కట్టడి చేయాలి.


సమన్వయం పెరగాలి..

మెట్రో, ఆర్టీసీ పరస్పర అనుసంధానంగా సేవలు ఉండాలి. ఇవి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. ఈ రెండు సంస్థల సమన్వయం మరింత పెరగాల్సి ఉంది.


స్కైవాక్‌లు..

స్కైవాక్‌లు రద్దీ ప్రాంతంలో అవసరం. మెట్రోకి అనుసంధానంగా వీటిని నిర్మిస్తామని చెప్పినా రెండు చోట్లకే పరిమితం అయ్యింది. సచివాలయం వంటి ప్రధాన పరిపాలన కేంద్రాల వరకు వీటిని నిర్మించాల్సి ఉంది.  ప్రధాన కూడళ్లలో హెచ్‌ఎండీఏ వీటిని నిర్మిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు