logo

నకిలీ పత్రాలతో వందల కోట్ల రుణాలు

గృహ, వ్యాపార రుణాల కోసం ప్రభుత్వ శాఖలు, విభాగాల పేరిట నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బ్యాంకులకు రూ.వందల కోట్ల మేర కుచ్చుటోపీ పెడుతోన్న ఘరానా మోసాన్ని బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు బట్టబయలు చేశారు.

Published : 20 Sep 2023 02:17 IST

బ్యాంకుల్ని మోసం చేస్తున్న రెండు ముఠాలు
రెండు కేసుల్లో 18 మంది నిందితుల అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌: గృహ, వ్యాపార రుణాల కోసం ప్రభుత్వ శాఖలు, విభాగాల పేరిట నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బ్యాంకులకు రూ.వందల కోట్ల మేర కుచ్చుటోపీ పెడుతోన్న ఘరానా మోసాన్ని బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు బట్టబయలు చేశారు. రెండు వేర్వేరు ముఠాల్లోని 18 మందిని బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీలు రషీద్‌, శ్రీనివాస్‌రావు, అదనపు డీసీపీ శోభన్‌కుమార్‌, బాలానగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌తో కలిసి సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర  కేసుల వివరాలు మంగళవారం వెల్లడించారు.

అడ్డదారిలో 645 మందికి..

సూరారం వాసి గంటా రంగారావు(63), కేపీహెచ్‌బీకాలనీలో నివాసముండే మానిక్‌ ప్రభు(62), కూకట్‌పల్లికి చెందిన నాగమల్లేశ్వరరావు(37), సుధాకర్‌రావు(54) సూరారంలో ఉండే సీతారామరావు(37), జీడిమెట్లకు చెందిన చంద్రశేఖర్‌రావు(38) ముఠాగా ఏర్పడ్డారు. గృహ రుణం అవసరమున్న వ్యక్తులు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతే బ్యాంకులు వాటిని తిరస్కరిస్తాయి. ఈ నేపథ్యంలో తమను సంప్రదించిన వారి కోసం ఈ ముఠా సభ్యులు బ్యాంకుల్ని తప్పుదోవ పట్టించేలా నకిలీ పత్రాలు సృష్టిస్తారు. తప్పుడు స్టాంపులతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ తదితర శాఖలు ఇచ్చే అనుమతి పత్రాలకు నకిలీవి సృష్టిస్తారు. రుణం వచ్చేలా బ్యాంకు సిబ్బంది, న్యాయపరమైన వ్యవహారాలు చూసే కొందరితో వీళ్లే రాయబారం నడిపిస్తారు. రుణం వచ్చాక ఆ మొత్తం నుంచి 3-4 శాతం చొప్పున కమీషన్‌ తీసుకుంటారు. ఈ ఆరుగురూ కలిసి దాదాపు ఇప్పటివరకూ 645 మంది.. ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు, అంతకుపైగా గృహరుణాలు ఇప్పించారు. ఈ ముఠా సమాచారం అందుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ  వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు.


535 మంది వ్యాపారులకు అప్పులు

కూకట్‌పల్లికి చెందిన నాగిరెడ్డి(24), జగద్గిరిగుట్టకు చెందిన షణ్ముఖరావు(37), రామరాజు(36) కూకట్‌పల్లికి చెందిన మణికంఠ(33), వేర్వేరు పేర్లతో కన్సల్టెన్సీలు ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి వ్యాపార రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మిస్తారు. వీరికి నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన దొరబాబు(36), మహేశ్‌(28), రాకేశ్‌ కుమార్‌(29), చంటి(31), నవీన్‌ కుమార్‌(29), రామ్‌తివారి(32), వీరబాబు(23), శంకర్‌రావు(26) రుణాలు ఇప్పించేందుకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార అవసరాల కోసం బ్యాంకు రుణాలు తీసుకోవడానికి సరైన ధ్రువపత్రాలు లేనివారు కూకట్‌పల్లిలోని ఈ నలుగురి కన్సల్టెన్సీల్లో సంప్రదిస్తుంటారు. దరఖాస్తుల్లో లోపాలుగుర్తించి వాటికి నకిలీ తయారుచేస్తారు. బ్యాంకులకు సమర్పించి రుణాలు వస్తే 2-3 శాతం కమీషన్‌, ఇతర ఛార్జీలు రూ.10 వేలు తీసుకుంటారు. నిందితులంతా కలిసి 535 మందికి రుణాలు ఇప్పించారు. ముఠా కార్యకలాపాలపై నిఘా ఉంచిన పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని