బోగస్ తీర్మానాలు
మూడేళ్ల వ్యవధిలో భారీగా అక్రమాలు
న్యూస్టుడే, కరీంనగర్ సుభాష్నగర్
మెప్మా కార్యాలయం
కరీంనగర్ మెప్మా పరిధిలో వేల సంఖ్యలో మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షణ చేసేందుకు లీడర్లు, రిసోర్స్పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, టౌన్ మిషన్ సమన్వయకర్తలు ఉంటారు. వీరందరిపై నగర, పట్టణాల పరిధిలో కమిషనర్ స్థాయి అధికారితో పాటు జిల్లా స్థాయిలో పీడీ ఉంటారు. వీరంతా మహిళా సంఘాల పనితీరు, జీవనోపాధి మెరుగు పర్చేందుకు రుణాలు మంజూరు వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని విధులను సక్రమంగా నిర్వర్తించేలా చూస్తారు. నిబంధనల ప్రకారం రుణాలు ఇవ్వాలంటే సంఘంతో పాటు సమాఖ్య పనితీరు కూడా పరిశీలించి ఆ మేరకు రుణ అర్హత కల్పిస్తారు. నగరపాలక సంస్థ పరిధిలో కొందరు ఆర్పీలు, కొందరు సీవోలు కలిసి బినామీ సంఘాలు ఏర్పాటు చేయడం, బ్యాంకులకు నకిలీ పత్రాలు అందించడం, కొన్ని బ్యాంకులు నిర్ధారణ చేసుకోకపోవడంతో రూ.కోట్ల నిధులు స్వాహా అయ్యాయి. ఏడాదిన్నర నుంచి ఈ అక్రమాలు జరుగుతుండగా స్పందించని బ్యాంకర్లు, తీసుకున్న రుణ మొత్తం రికవరీ కాని సమయంలో నోటీసులు పంపించడంతో అసలు విషయాలు ఒక్కొక్కటీగా బయట పడుతున్నాయి.
ఆన్లైన్లో నమోదు కాకుండానే..
మహిళా సంఘాలు రుణం తీసుకోవాలంటే సంఘ సభ్యుల తీర్మానం తప్పనిసరి. కచ్చితంగా దేనికోసం అనేది స్పష్టంగా రాసుకోవాల్సి ఉంటుంది. సమాఖ్య కూడా తీర్మానం చేయాలి. రుణ చెల్లింపులలో సంఘం సభ్యులు ఎవరైనా చెల్లించకపోయినా సరే మిగతా సభ్యులంతా కలిసి చెల్లిస్తామనేది హామీని బ్యాంకర్లు పరిగణలోకి తీసుకుంటారు. రుణానికి దరఖాస్తు చేసుకున్న సంఘం ఉంటుందో ఆ సంఘం, సభ్యుల పేర్లు కచ్చితంగా ఆన్లైన్లో నమోదు అయి ఉండాలి. ఇవేవి లేకుండానే బ్యాంకులు రుణాలు మంజూరు చేశారు.
ఉన్నతాధికారి పరిశీలన
మహిళా సంఘాలకు సంబంధించి రుణాలు తీసుకున్న ఒకటెండ్రు బ్యాంకులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తుండగా ఇప్పటి వరకు 24 సంఘాలు బోగస్వి గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.2.72 కోట్లు స్వాహా జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి సంబంధించి లెక్కలు తేలితే ఈ మొత్తం రూ.4కోట్లు దాటుతుందని అంటున్నారు. ఈ అక్రమాల తీరుపై గత నాలుగు రోజులుగా ‘ఈనాడు’లో వరుసగా వస్తున్న కథనాలపై ఓ ఉన్నతాధికారి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన దస్త్రాలన్నీ తెప్పించుకొని ఎవరి పాత్ర ఎంత మేరకు ఉందనే కోణంలో విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
ఆ సమయంలోనే..
నగరంలో బోగస్ సంఘాలను ఏరి వేయడానికి గతంలో డీఈఈ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సంఘాన్ని, అందులో ఉన్న సభ్యులను ధ్రువీకరించుకున్న తర్వాతే రుణానికి అర్హత కల్పించే వారు. ఆ తర్వాత మూడేళ్ల వరకు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ అనేది లేకుండా చేశారు. ఈ మధ్య కాలంలో బల్దియాలోనే పని చేస్తున్న మెప్మా సిబ్బందే ఇన్ఛార్జిగా వ్యవహరించడం, కమిషనర్ కాని, ఆ స్థాయి అధికారి కాని ఎలాంటి సంతకాలు కూడా తీసుకోకుండానే బ్యాంకర్లకు సంఘాల జాబితా పంపించడం అంతా జరిగిపోయింది. ఆ సమయంలోనే బోగస్ సంఘాలు, బినామీ పేర్ల మీద సంఘాలు సృష్టించుకొని నకిలీ పత్రాలు తయారు చేసుకొని రుణాలు పొందారు. ఇలా పొందిన రుణాలు సుమారు రూ.6కోట్లు పైగా ఉన్నట్లు విచారణలో తేలింది. అక్రమార్కులు చేసిన తప్పులకు పలు సంఘాల సభ్యులు ఈ రుణాన్ని తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి బినామీ సంఘాలు వందకు పైగా ఉన్నట్లు ప్రస్తుత అధికారులు భావిస్తుండగా పూర్తిస్థాయిలో విచారణ చేస్తే తప్ప లెక్క తేలేలా లేదు.