logo

ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లాల జడ్పీ సీఈఓలు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో

Published : 07 Dec 2021 05:48 IST


డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కర్ణన్‌

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లాల జడ్పీ సీఈఓలు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి 8 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్‌ జడ్పీ కార్యాలయం, హుజూరాబాద్‌, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, హుస్నాబాద్‌ ఎంపీడీవో కార్యాలయాలు, రాజన్నసిరిసిల్ల జడ్పీ సీఈఓ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయన్నారు. ఈ నెల 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, ప్రతి కేంద్రంలో 200మంది ఓటుహక్కు వినియోగించుకునే అవకాశముందని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ ఓటు వేస్తారని తెలిపారు. సంతకం చేయలేని వారు వేలిముద్ర వేసే వారు సహాయకుల కోసం మూడు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు వేసే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, ఆరు అడుగుల దూరం పాటించాలని, గ్లౌజులు ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ తీసుకు రాకుండా బయట హెల్ప్‌డెస్క్‌లో డిపాజిట్‌ చేయించాలన్నారు. కొవిడ్‌ ఉన్న వారు పోలింగ్‌ రోజున మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటు వేయవచ్చునని, ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 11రకాల గుర్తింపు కార్డులు తీసుకురావాలన్నారు. పోలింగ్‌ అధికారి ఇచ్చే వాయిలెట్‌ పెన్‌తో బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు వేసే అంకెలను ప్రాధాన్య క్రమంలో వేసేలా అధికారులు ఓటర్లకు సూచించాలని తెలిపారు.

డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం పరిశీలన

నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎన్నికల అధికారి ఆర్‌.వి.కర్ణన్‌ సోమవారం పరిశీలించారు. ఈ నెల 9న ఎన్నికల అధికారులు ఎన్నికల సామగ్రితో ఉమ్మడి జిల్లాలోని కేంద్రాలకు వెళ్తారన్నారు. పోలింగ్‌ అనంతరం తీసుకు వచ్చే బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు తనిఖీ చేశారు.

72గంటల ముందు ప్రచారం ముగించాలి

ఈ నెల 10న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 72గంటల ముందు ఈ నెల 7న రాత్రి 7గంటల వరకు ప్రచారం ముగించాలని కోరారు. ప్రచారం చేస్తే నిబంధనల ఉల్లంఘన కింద రెండు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తారన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఆర్‌డీఓ అనంద్‌కుమార్‌, ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు