logo

ఉపాధికి రుణాలు.. ఆర్థికాభివృద్ధికి బాటలు

జిల్లాలోని మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ఉమ్మడి జిల్లా మహిళలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరువ్యాపారాల ప్రోత్సాహంలో భాగంగా ఆహార ఉత్పత్తులతోపాటు వివిధ రకాల

Published : 25 May 2022 02:39 IST

ఉమ్మడి జిల్లాలో 14,973 యూనిట్ల లక్ష్యం
సారంగాపూర్‌, న్యూస్‌టుడే

యూనిట్‌ను పరిశీలిస్తున్న అధికారులు

జిల్లాలోని మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ఉమ్మడి జిల్లా మహిళలు రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరువ్యాపారాల ప్రోత్సాహంలో భాగంగా ఆహార ఉత్పత్తులతోపాటు వివిధ రకాల యూనిట్లను మహిళల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నారు. దీని ద్వారా మార్కెట్‌లోకి నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, వస్తువులతోపాటు మహిళలకు జీవనోపాధి లభించేలా చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 14,973 యూనిట్లు ఏర్పాటు చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించగా, 14,423 యూనిట్లను గుర్తించి, 10,322 ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో 4,328 లక్ష్యం కాగా 4,180, కరీంనగర్‌లో 4,067కి గాను 3,709, పెద్దపల్లిలో 3,447కు 3,530, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,131 లక్ష్యానికి గానూ 3,004 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. కరీంనగర్‌లో లక్ష్యానికి మించి యూనిట్లను గుర్తించగా, ఇప్పటికే జగిత్యాలలో 2,496 యూనిట్లు, కరీంనగర్‌లో 2,622, పెద్దపల్లలో 2,704. రాజన్న సిరిసిల్లలో 2,500 యూనిట్లను నెలకొల్పేలా చూశారు. ఆయా మహిళా సంఘాల సభ్యులకు రూ.17.05 కోట్ల రుణాలు అందించి ప్రోత్సహించారు. మరిన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు గ్రామాల వారీగా మహిళా సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు.  

ఉత్పత్తులను విక్రయిస్తున్న మహిళలు

జగిత్యాలలో విక్రయ కేంద్రం ఏర్పాటు
జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి నాబార్డు సహకారంతో రూ.5 లక్షల రుణాన్ని తీసుకుని జగిత్యాలలో విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. సారంగాపూర్‌ మండలంలోని రంగపేటలో న్యాప్కిన్‌ యూనిట్‌, జగిత్యాల మండలంలోని అంతర్గాంలో పసుపు పొడి తయారీ, లక్ష్మీపూర్‌, చల్‌గల్‌లో గానుగతో తయారీ, పిండి వంటలు చేసే నూనె యూనిట్‌, పెగడపల్లిలో చేనేత వస్త్ర తయారీ, గొల్లపల్లి మండలంలో ఫ్లోర్‌ క్లీనర్‌, కథలాపూర్‌లో ఎల్‌ఈడీ బల్బుల తయారీ, మల్యాల, కోరుట్లలో అగరుబత్తుల తయారీ, పచ్చళ్లు, బియ్యం విక్రయాలు చేస్తున్నారు. వెల్గటూర్‌ మండలంలో జ్యూట్‌ బ్యాగులు, రాయికల్‌ మండలంలో బనియన్స్‌, పెట్టీకోట్స్‌, ఇబ్రహీంపట్నంలో పేపర్‌ ప్లేట్ల తయారీ చేస్తున్నారు.

సహజ పేరుతో మార్కెటింగ్‌
ఆదాయాభివృద్ధిలో భాగంగా బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తున్నారు. దీనిద్వారా మహిళలు అర్థికంగా బలోపేతం అవుతుండడమే కాకుండా చిరువ్యాపారాలను ప్రోత్సహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు, ఇందుకుగాను ఒక్కో మహిళకు రూ.75వేలు తగ్గకుండా రూ.3 లక్షల వరకు అందిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని రుణాలు అందించేలా చూస్తున్నారు. వీటితోపాటు  ఇప్పటికే మండలాల్లో తయారు చేస్తున్న ఉత్తత్పులను గుర్తించి ‘సహజ’ బ్రాండ్‌ పేరుతో మార్కెంటింగ్‌ చేస్తున్నారు.


నాణ్యమైన ఉత్పత్తులు

-శ్రీకార్‌ సుధీర్‌, అదనపు పీడీ, జగిత్యాల

చిరువ్యాపారులను ప్రోత్సహించడమే కాకుండా మహిళల ఆదాయాభివృద్ధికోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా అందుబాటులో నాణ్యమైన ఉత్పత్తులు లభించనున్నాయి. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే జిల్లాలో 4328 లక్ష్యానికి గానూ 2496 యూనిట్లను ఏర్పాటు చేశాం. ఒక్కో మహిళ చిరువ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రూ.75వేలు తగ్గకుండా రుణం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.


స్థానికంగా ఉపాధి..

- శ్రీలత, జిల్లా సమాఖ్య కోశాధికారి  
చిరువ్యాపారాలను ప్రోత్సహించడంతో అందుబాటులో నాణ్యమైన ఉత్పత్తులు లభించనున్నాయి. అంతేకాకుండా స్థానికంగా వ్యాపారం చేయడంతో మహిళలకు ఆదాయాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. జిల్లాలోని మహిళలందరి సహకారంతో ‘సహజ’ బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌లో పలు ఉత్పత్తులు విక్రయిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని