logo

మత్తులో ముంచుతున్నారు

ఇక్కడ సీసాల్లో కనిపిస్తున్నది గంజాయి ద్రావణం. నేరుగా గంజాయి రవాణా చేయడం కష్టం కావడంతో రవాణాదారులు ద్రావణం రూపంలో కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న రామగుండంలో గంజాయి ద్రావణాన్ని ఆబ్కారీ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్‌ నుంచి వస్తున్నట్లు గుర్తించారు.

Published : 24 Jun 2022 04:25 IST

గంజాయి తాగేవారే సూత్రధారులు 

కట్టడి చేస్తున్నా.. గుట్టుగా రవాణా

ఉమ్మడి జిల్లాలో పెరిగిన వినియోగం

ఈనాడు డిజిటల్, పెద్దపల్లి, న్యూస్‌టుడే, గోదావరిఖని

ఇక్కడ సీసాల్లో కనిపిస్తున్నది గంజాయి ద్రావణం. నేరుగా గంజాయి రవాణా చేయడం కష్టం కావడంతో రవాణాదారులు ద్రావణం రూపంలో కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న రామగుండంలో గంజాయి ద్రావణాన్ని ఆబ్కారీ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్‌ నుంచి వస్తున్నట్లు గుర్తించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడే స్వయంగా గంజాయి రవాణాలో కీలక పాత్ర పోషించాడు. మహారాష్ట్ర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మంథని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాచిడి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అతని డ్రైవర్‌ రాజు వేరు వేరు కార్లలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. రూ.32 లక్షల విలువ చేసే 103.83 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 20 కిలోల గంజాయిని మార్చిలో స్వాధీనం చేసుకున్నారు. నిజమాబాద్‌ జిల్లా కామారెడ్డి నుంచి సిరిసిల్లకు గంజాయిని ప్లాస్టిక్‌ కవర్లలలో రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేములవాడలో చాక్లెట్‌ ప్యాకెట్ల మాదిరిగా పాన్‌షాపుల్లో రహస్యంగా విక్రయిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో గంజాయి రవాణా గుట్టుగా సాగుతోంది.. గంజాయి మత్తుకు అలవాటుపడ్డ యువత దేనికైనా సిద్ధపడే పరిస్థితికి చేరుకుంటున్నారు.. గతంలో గంజాయిని జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పండించేవారు.. పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి సాగు క్రమంగా తగ్గిపోయింది. అనంతరం కొంత మంది వైజాగ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి రవాణా చేసే వారు. ఇటీవల అక్కడి నుంచి కూడా నిఘా పెరగడంతో చింతూరు ప్రాంతం నుంచి రవాణా చేసుకుంటున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, తిర్యాణి ప్రాంతాల్లో పత్తిలో అంతర సాగుగా గంజాయిని పండిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని భారీ ఎత్తున ఒకేసారి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసుకుని ప్రజా రవాణా సంస్థలకు చెందిన బస్సులు, రైలు మార్గాల్లో ఎక్కువగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. 

పెద్దపల్లి జిల్లాలో స్వాధీనం చేసుకున్న గంజాయిని

దహనం చేసేందుకు సిద్ధం చేసిన పోలీసులు(పాతచిత్రం)

బానిసలుగా మారి..

గంజాయి మత్తుకు బానిసలుగా మారిన వారే ప్రస్తుతం దందాను సాగిస్తున్నారు. గతంలో మత్తు కోసం గంజాయి సరఫరా చేసే వారితో సంబంధాలు పెట్టుకుని వినియోగించే వారు. ప్రస్తుతం వారే స్వయంగా గంజాయిని రవాణా చేస్తూ వారు వినియోగించుకుంటూ.. ఖర్చులకు సరిపడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో గంజాయి మత్తుకు అలవాటుపడ్డ యువత గంజాయి సాగుచేసే ప్రాంతాలను తెలుసుకుని అక్కడి నుంచి రవాణా చేసుకుంటున్నారు. వాట్సాప్‌ గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని కోడ్‌ భాషల్లో మెసేజ్‌లు చేసుకుంటున్నారు.

సరిహద్దు జిల్లాల నుంచి 

ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు జిల్లాల నుంచి గంజాయి చేరుకుంటుంది. పెద్దపల్లి జిల్లాకు రైలు మార్గం ద్వారా ఎక్కువగా చేరుకుంటుంది. మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ల నుంచి గంజాయి సరఫరా చేసే వారు రైలు మార్గం ద్వారా రామగుండం, పెద్దపల్లి స్టేషన్‌లకు చేరుకుంటున్నారు. జగిత్యాల జిల్లాకు మహారాష్ట్ర నుంచి మంచిర్యాల మీదుగా రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాకు నిజమాబాద్‌ మీదుగా సరఫరా అవుతుంది. కరీంనగర్‌ జిల్లాలోని ప్రధాన నగరం, పట్టణాలకు కూడా ఎక్కువగా మహారాష్ట్ర నుంచే చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి

స్వాధీనం చేసుకున్న గంజాయి(పాతచిత్రం)  

వలస కార్మికుల వినియోగం

ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా వలస కార్మికులు పనిచేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇళ్ల నిర్మాణాలు, భారీ ప్రాజెక్టుల్లో ఎక్కువగా బీహార్, చత్తీస్‌ఘడ్, ఒడిశా ప్రాంతాలకు చెందిన కార్మికులు పని చేస్తుండటంతో ఇందులో చాలా మందికి గంజాయి తాగే అలవాటు ఉంది. ఇటీవల ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పనిచేసే ఇతర రాష్ట్రానికి చెందిన ఓ కార్మికున్ని పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లాలోని కోల్‌బెల్టు ప్రాంతంలో ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ప్యాకేజీ పనుల్లో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులే ఎక్కువగా పనిచేస్తున్నారు. వారి సొంత రాష్ట్రాలకు రాకపోకలు సాగించడంతో పాటు గంజాయి మత్తుకు అలవాటున్న వారు అక్కడి నుంచి తెస్తున్నట్లు తెలుస్తోంది.

పెరిగిన పోలీసుల నిఘా

గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. గతం కంటే రవాణా తగ్గినప్పటికీ ఇంకా మత్తుకు బానిసలైన వారికి చేరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ, ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు పక్కా సమాచారం సేకరిస్తూ ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడ్డ వారి వివరాలను సేకరిస్తున్నారు. వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు. 

కరీంనగర్‌ అర్బన్‌ ఆబ్కారీ శాఖ  పోలీసులు పట్టుకున్న

గంజాయితో  ఇంజినీరింగ్‌ విద్యార్థి

ఫిబ్రవరి 12న కరీంనగర్‌ విద్యానగర్‌లో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి వద్ద ఉన్న 1.5 కిలోల గంజాయిని ఆబ్కారీ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తోటి విద్యార్థులతో పాటు యువతకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు పట్టుకున్నారు.

పీడీ చట్టం అమలు చేస్తున్నాం - సత్యనారాయణ, కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌

గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఒకటి రెండు సార్లు పట్టుబడితే పీడీ చట్టం అమలు చేస్తున్నాం. చాలా వరకు గంజాయి రవాణా అదుపులోకి వచ్చింది.  పూర్తిగా తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి మత్తుకు అలవాటు పడ్డ వారిపైనే నిఘా పెట్టాం. ఇటీవల ఎక్కువగా వారే రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమందిపై పీడీ చట్టం అమలు చేశాం. కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. మార్పు రాకపోతే పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆబ్కారీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటు పూర్తిస్థాయిలో నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని