మహాత్ముడి మాట.. స్వచ్ఛత బాట
‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న మహాత్ముడి మాటలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత.. సంపూర్ణ స్వచ్ఛత సాధిస్తూ, ఆరుబయట ...
పల్లెల్లో వికసిస్తున్న అభివృద్ధి పరిమళాలు
సమష్టి సహకారంతో వరిస్తున్న జాతీయ పురస్కారాలు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న మహాత్ముడి మాటలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత.. సంపూర్ణ స్వచ్ఛత సాధిస్తూ, ఆరుబయట మలమూత్ర రహిత ప్రాంతాలుగా గుర్తింపు పొందుతూ గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని స్వచ్ఛతలో ముందువరుసలో నిలుస్తున్నాయి. యువత ఉత్సాహం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారం, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ప్రగతిలో మెరుస్తున్నాయి. జాతీయ స్థాయిలో కీర్తి పతాకం రెపరెపలాడిస్తూ పురస్కారాలను సొంతం చేసుకుంటున్నాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో జాతీయ పురస్కాలు పొందిన పంచాయతీల స్ఫూర్తిపై ప్రత్యేక కథనం.
నాలుగు విభాగాల్లో అవార్డులు
పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు మెరుగైన పాలన అందించిన పల్లెలకు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సశక్తి కరణ్, రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు.. ఇలా నాలుగు విభాగాల్లో నగదు పురస్కారాలు అందిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 2013-14లో జాతీయ పురస్కారాల ప్రస్థానం మొదలైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మన నాలుగు జిల్లాలకు అవార్డులు వరించాయి. గ్రామ పంచాయతీలకు రూ.12 లక్షలు, మండల పరిషత్లకు రూ.25 లక్షలు, జిల్లా పరిషత్కు రూ.50 లక్షల నగదు పంపిణీ చేస్తున్నారు. ఈ నగదు ప్రోత్సాహకాలతో గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. కాగా ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవడంలో కొన్ని పల్లెలు ముందుంటున్నప్పటికి మరికొన్ని మెరుగు కావాల్సి ఉంది.
‘పల్లె’వించిన ప్రగతి వికాసం
పల్లెల అభివృద్ధి నిధుల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నారు. పల్లెప్రగతిలో శ్మశానవాటికలు, చెత్త సేకరణతో అదనపు ఆదాయం పొందేందుకు డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, ఆహ్లాదం పంచేందుకు పల్లె ప్రకృతివనాలు, ఇంటికొక మరుగుదొడ్డి, సామూహిక శౌచాలయాలు నిర్మించి సంపూర్ణ పారిశుద్ధ్యంలో భేష్ అనిపించుకుంటున్నాయి. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, రక్తహీనత తదితర వ్యాధులను అధిగమించేందుకు స్వశక్తి సంఘాలు శానిటరీ న్యాప్కిన్లు తయారు చేస్తూ తక్కువ ధరలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా పరిషత్ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, మండల పరిషత్లలో మంథని, ధర్మారం, కాల్వశ్రీరాంపూర్, కోరుట్ల, సుల్తానాబాద్, పెద్దపల్లిలకు పురస్కారాలు దక్కాయి.
ధర్మారం మండలం కటికెనపల్లిలో పల్లె ప్రకృతివనం
వరించిన జాతీయ పురస్కారాలు
గ్రామ పంచాయతీ సశక్తికరణ్: 27
రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ: 4
చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు: 2
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక: 1
జాతీయ పురస్కారం పొందిన మంథని మండలం నాగారం గ్రామ సచివాలయం
స్వచ్ఛతలో ‘పెద్ద’పల్లి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ పురస్కారాల్లో పెద్దపల్లి జిల్లా అగ్రపథంలో కొనసాగుతోంది. స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్-2018 సర్వేలో 97.45 మార్కులతో దేశంలో మూడో స్థానం, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఇదే కేటగిరీలో 2019లో మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అప్పటి కలెక్టర్ శ్రీదేవసేన ‘స్వచ్ఛభారత్ దినోత్సవ పురస్కారం’ అందుకున్నారు. 2019లో స్వచ్ఛతా దర్పణ్లో ‘స్వచ్ఛ్ సుందర్ శౌచాలయ్’ అవార్డు సొంతమైంది.
వజ్రోత్సవ కవితలు
అమృతాన్ని...!
ఔను..నిస్సందేహంగా అమృతమే!
అమ్మ ఎదురు చూస్తున్నది అందరికీ పంచుమని ఏనాటి నుంచో నిజం..సుజలాలే!
బిడ్డలందరి గొంతు తడుపుకొని తల్లి గుర్తు చేస్తున్నది పదే పదే పళ్లైనా కాయలైనా పంచుకొని తినడమే మంచిదని చెబుతున్నది.
-డాక్టర్ నలిమెల భాస్కర్, రచయిత
-న్యూస్టుడే, కరీంనగర్ సాంస్కృతికం
జెండా నీకు వందనం
తను నిలుచున్నది మంచుకొండయినా
పడుకున్నది పరుపు బండయినా
తుపాకీ గొట్టం మీద శాంతి కపోతాన్ని ఎగరేసి తనువును మనసును త్యాగం చేసి ఆ త్యాగాన్నే కాషాయంగా జెండాకు పూసిన సైనికుడా నీకు వందనం
సూది మొన మీద భూగోళాన్ని నిలిపి తరగతి గదినే వినీలాకాశం చేసి నల్లని బోర్డుల మీద తెల్లటి అక్షరాలతో దేశ భవితను దిద్ది ఆ తెల్లదనాన్ని జెండా కద్దిన గురువులారా మీకు వందనం
వెన్నునే నాగలి చేసి మన్నులో మానెడు పోసి సాలు సాలుకు నొప్పులు తీసి నేలను పచ్చ పువ్వును చేసి ఆ పచ్చ రంగునే జాతీయ జెండాకు పూసిన రైతన్న నీకు వందనం వేల సూర్యులు నేల కొరిగినా ఎత్తి పట్టిన మువ్వన్నెల జెండా నీకు వందనం
-పెద్దింటి అశోక్ కుమార్, రచయిత
-న్యూస్టుడే, సిరిసిల్ల(విద్యానగర్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!