logo

అమ్మా లే.. అమ్మా ..!

హృదయ విధారకమైన ఈ సంఘటన కరీంనగర్‌ నగరపాలక సంస్థలోని అలుగునూర్‌లో చోటుచేసుకుంది.  సిల్ల అనూష(26)  కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో బుధవారం మృతి చెందింది.

Updated : 18 Aug 2022 06:48 IST

తల్లి మృతదేహం వద్ద పిల్లల వేదన

తల్లిని పిలుస్తున్నచిక్కీ

ఆ చిన్నారులకేమి తెలుసు అమ్మలేదని.. ఇక తిరిగి రాదని..
అందుకే ఎప్పటిలాగే తల్లి పక్కనే ఆడుకుంటున్నారు..
మమతానురాగాల మాతృ ప్రేమకై ఇలా తల్లడిల్లుతున్నారు..
చుట్టూ గుమిగూడిన జనాలు రోదిస్తుంటే దీనంగా చూస్తున్నారు..
ఆప్యాయంగా బోసినవ్వుల పాప అమ్మ మోమును చూస్తుంటే..
ఏడాదిన్నర వయసున్న కొడుకు అమ్మ నుదురుని ముద్దాడుతుంటే..
ఊహ తెలియని చిన్నారి ‘అమ్మా లెమ్మని’ సైగలతో చేయిపట్టుకుంటుంటే..
పాలు కావాలనేలా.. ప్రేమ పంచాలనేలా అమ్మా.. రమ్మని బాబు పిలుస్తుంటే...
చుట్టూ ఉన్న వారి గుండెలు కరిగిపోయాయి. ఆగని వేదనతో చూపరులకు కన్నీళ్లు రాలాయి.
ఈ మరణాన్ని చూసి అందరి కళ్లు చెమర్చాయి. విధి ఆడిన నాటకమీ.. ఘోరమనే వేదనను మిగిల్చాయి.

హృదయ విధారకమైన ఈ సంఘటన కరీంనగర్‌ నగరపాలక సంస్థలోని అలుగునూర్‌లో చోటుచేసుకుంది.  సిల్ల అనూష(26)  కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో బుధవారం మృతి చెందింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలకు ఏమి జరిగిందో కూడా తెలియని పరిస్థితి.. ఏడాదిన్నర ఉన్న బాబు(రిషికేష్‌)తోపాటు 8నెలల చిన్నారి(చిక్కీ) తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న తీరు బంధువులను అయినవారిని కన్నీటి సంద్రంలో ముంచింది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. అనూష కిడ్నీలో రాళ్లున్నాయనే బాధతో గత కొన్నాళ్లుగా భర్త అనిల్‌కుమార్‌తో కలిసి నగరంలోని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. రెండు కిడ్నీలలో రాళ్లున్న ఇబ్బందికి వైద్యుల సూచనతో మందులు వాడారు. ఇంతలోనే ఆమె ఆరోగ్య సమస్య విషమించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స కోసం దాదాపుగా రూ.లక్షకుపైగా వెచ్చించినా తన భార్య బతకలేదనే వేదనను భర్త విలపిస్తూ తెలిపారు. తల్లి మృతితో రెండేళ్లలోపున్న చిన్నారుల వేదన కలచివేస్తోంది..

   -ఈనాడు, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని