logo

సింగరేణి ఆస్పత్రిలో కార్మికుడి మృతి

సింగరేణి ఆస్పత్రిలో ఓ కార్మికుడు మృతి చెందాడు. అతని మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు సింగరేణి ఆస్పత్రి ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు.

Published : 29 Sep 2022 04:53 IST

వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన


శ్రీనివాస్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణి ఆస్పత్రిలో ఓ కార్మికుడు మృతి చెందాడు. అతని మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు సింగరేణి ఆస్పత్రి ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్జీ-1 సీఎస్పీ-1లో జనరల్‌ మజ్దూర్‌గా పనిచేసే తిప్పారపు శ్రీనివాస్‌(46) శుక్రవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. కాగా మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనివాస్‌ మృతి చెందాడు. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండగా సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే శ్రీనివాస్‌ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్కానింగ్‌ తీయగా రిపోర్టు రావడానికి రెండు రోజుల సమయం పట్టిందని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేయమని వేడుకున్నా వైద్యులు నిర్లక్ష్యం చేశారన్నారు. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బుధవారం ఉదయం ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. కార్మికుడికి చికిత్స అందించడంలోనే వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే వారి కుటుంబ సభ్యులకు ఏ విధంగా చికిత్స అందిస్తారని కార్మిక నాయకులు ప్రశ్నించారు. వైద్యునిపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఓటుజీఎం రామ్మోహన్‌ చెప్పడంతో ఆందోళన విరమించారు. గాంధీనగర్‌లో నివాసం ఉండే శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కార్మికుడి కుటుంబానికి  రావాల్సిన ప్రయోజనాలు వెంటనే అందించాలని సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకులు టి.రాజారెడ్డి, ఐ.కృష్ణలు డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్‌ నాయకులు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, జడ్పీటీసీ కందుల సంద్యారాణి పరామర్శించారు.


ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, కార్మిక నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు