logo

ఓటరు నమోదుకు అవకాశం

జిల్లాలోని 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది.

Published : 26 Nov 2022 05:26 IST

ఈ నెల 26, 27 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు
న్యూస్‌టుడే, మెట్‌పల్లి

ఓటు వేయడానికి వరుసలో నిల్చున ఓటర్లు (పాతచిత్రం)

జిల్లాలోని 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌తో పాటు పోలింగ్‌ బూత్‌ల వారీగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 26, 27 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులు బీఎల్‌వోలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ కేంద్రాల్లో కొత్తగా ఓటు నమోదు చేయడానికి ఫారం-6, పేరు తొలగించడానికి ఫారం-7, మార్పులు, చేర్పులకు ఫారం-8 లతో అందుబాటులో ఉంచుతారు. ఆధార్‌కార్డు లేదా పాసుపోర్టు తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్‌ 3, 4 తేదీల్లో సైతం ప్రత్యేక నమోదు కార్యక్రమం చేపడతారు. జిల్లా పాలనాధికారి రవి బీఎల్‌వోలకు దిశానిర్దేశం చేశారు.

అభ్యంతరాల స్వీకరణ..

కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా అధికారులు ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 6,40,247 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,10,776 మంది, మహిళలు 3,29,456 మంది, ఇతరులు 15 మంది ఉన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్‌ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్లు గ్రామ పంచాయతీలు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద గల ఓటరు జాబితాలో పరిశీలించుకొని మార్పులు, చేర్పులు, తొలగింపునకు, సవరణలు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను డిసెంబర్‌ 26 వరకు పరిశీలించి 2023 జనవరి 5న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. ఆధార్‌ అనుసంధానంతో రెండు మూడు చోట్ల ఓటర్లుగా నమోదైన వారిని తొలగించడంతో ఓటర్ల సంఖ్య తగ్గింది.

నిరంతర ప్రక్రియ   -వినోద్‌కుమార్‌, ఆర్డీవో, మెట్పల్లి

ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటరు జాబితాను పరిశీలించుకొని ఓటు లేకపోతే నమోదుకు, తప్పులుంటే సవరణలు చేసుకునేందుకు ఇది మంచి అవకాశం. ఈ నెల 26, 27 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాం. బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు. శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని