logo

తనిఖీలు మమ.. చర్యలు భ్రమ

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో ప్రైవేటు ఆస్పత్రుల్లోని సేవలు, అనుమతులు, ఇతరత్రా వసతులపై పరిశీలించేందుకు నెలన్నర రోజుల కిందట పక్షం రోజులపాటు వరుసగా తనిఖీలు నిర్వహించారు.

Published : 04 Dec 2022 06:07 IST

నెలన్నర రోజులు దాటినా తాఖీదులకే పరిమితం
ఉమ్మడి జిల్లాలో తూతూ మంత్రంగానే ఆసుపత్రుల పరిశీలన
ఈనాడు, కరీంనగర్‌

జమ్మికుంట ఆసుపత్రిలో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో ప్రైవేటు ఆస్పత్రుల్లోని సేవలు, అనుమతులు, ఇతరత్రా వసతులపై పరిశీలించేందుకు నెలన్నర రోజుల కిందట పక్షం రోజులపాటు వరుసగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో అధికారులు బృందాలుగా విడిపోయి పరిశీలనలు జరిపారు. తమ దృష్టికి వచ్చిన లోపాలను నమోదు చేసుకోవడంతో పాటు అనుమతి పత్రాలు లేని వాటికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఒకటి రెండు ఆస్పత్రులను సీజ్‌ చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-2010 ప్రకారం భవనాల తీరు, రోగులకు అందే సేవలపై లోతుగా పరిశీలనలు చేపట్టారు. తనిఖీలు నిర్వహించిన ఆస్పత్రుల్లో 35 శాతం మేర నిబంధనలను అతిక్రమిస్తున్నాయనే విషయాన్ని తనిఖీ బృందాలు గుర్తించాయి.

నివేదికతో సరి..

దంత వైద్యశాలతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల వైద్య సేవలపై పరిశీలించారు. ముఖ్యంగా కరీంనగర్‌లో ఆస్పత్రుల సంఖ్యను చూసి వైద్యాధికారులే విస్తుపోయారు. అనుమతి పత్రాల్లో ఉన్న పేరు కాకుండా ఇతర పేర్లతో నడుస్తున్నవి కొన్ని ఉండగా, అర్హత లేని వైద్యులు, సరైన వసతులు లేనివి మరికొన్ని ఉన్నట్లు తేలింది. కాగా ఇప్పటికీ సదరు ఆస్పత్రులపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఇంకా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. జిల్లాల్లో నిబంధనలను ఉల్లంఘించిన తీరుపై వాస్తవాలు వివరిస్తూ నివేదికలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించామని, వారి ఆదేశాల మేరకే చర్యలుంటాయని ఉమ్మడి జిల్లాలోని వైద్యాధికారులు చెబుతున్నారు. 

అప్పుడు...

సెప్టెంబరు చివరి వారం నుంచి అక్టోబరు రెండో వారం వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులంతా ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీల్లో తలమునకలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులపై కొరడా ఝుళిపించారు. గంటల తరబడి దస్త్రాలు, అనుమతుల పత్రాల గురించి ఆరా తీశారు. గుర్తింపు లేని వాటి విషయంలో కన్నెర్ర చేస్తూ ఆగమేఘాల మీద తాఖీదులు అందజేశారు. బృందంలోని ఏ ఒక్కరిని పలకరించినా ‘చర్యలు తప్పవు’ అనేలా దూకుడు కనిపించింది.

ఇప్పుడు..

* తనిఖీలు జరిగి నెలన్నర రోజులు గడుస్తున్నా.. ఏ ఒక్క అధికారి కూడా సదరు ప్రైవేటు ఆస్పత్రుల కథ ఏమిటనే విషయమై స్పష్టతనివ్వలేకపోతున్నారు. దవాఖానాల్లో దగా తీరు నిజమేనని తెలిసినా.. నిబంధనలకు విరుద్ధంగా వాటిని నడిపిస్తున్నారని గుర్తించినా.. తామేమీ చేయలేమన్నట్లుగా మిన్నకుంటున్నారు. కనీసం అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. నోటీసులు అందించడంతోనే తమ పని అయిపోయిందన్నట్లుగా చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో తాఖీదులు తమనేం చేస్తాయనుకుంటూ పలు ఆస్పత్రుల యాజమాన్యాలు యథావిధిగా నడిపిస్తున్నాయి. తమను ఎవరేం చేయగలరనే తీరును చేతల్లో చూపిస్తున్నాయి.

గుర్తించిన లోపాలు ఇలా..

* చాలా ఆసుపత్రుల్లో చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగే పరిస్థితులు లేవు.
* అగ్ని ప్రమాదం జరిగితే నిరోధించడానికి చాలా చోట్ల ఉపకరణాలు కనిపించలేదు.  
* బహుళ అంతస్థుల్లో ఏర్పాటు చేసిన కొన్ని ఆసుపత్రుల్లో రోగులకు భద్రత కరవైంది.
* కొన్ని చోట్ల ఆపరేషన్‌ థియేటర్‌, ప్రసూతి గదులు సక్రమంగా లేనట్లు తేలింది.
* చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి ఆవరణలోనే ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
* బోర్డుల్లో పేర్కొన్న వైద్యులు వాస్తవంగా సేవలందించడం లేదనేది బృందాల దృష్టికి వచ్చింది.
* అర్హత లేకున్నా కొందరు వైద్యులు చికిత్స అందిస్తున్న విషయం కొన్ని చోట్ల వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని