logo

పంచాయతీలకు శుభవార్త

గత ఎనిమిది నెలలుగా పంచాయతీలు నిధుల లేమితో నీరసించాయి. గ్రామాల్లో ఏ అభివృద్ధి పనైనా డబ్బులతో కూడుకొని ఉంటుంది.

Published : 06 Dec 2022 03:18 IST

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌

దుర్శేడు గ్రామపంచాయతీ కార్యాలయం

గత ఎనిమిది నెలలుగా పంచాయతీలు నిధుల లేమితో నీరసించాయి. గ్రామాల్లో ఏ అభివృద్ధి పనైనా డబ్బులతో కూడుకొని ఉంటుంది. సర్పంచులు అప్పులు తెచ్చి పనులు నిర్వహిస్తున్న సందర్భంలో కేంద్రం అందించే 15వ ఆర్థిక సంఘం మొదటి దఫా నిధులు విడుదల చేసి పంచాయతీలు కొత్తగా తీసిన ఖాతాలకు జమ చేసింది. ఈ నిర్ణయంతో సర్పంచులకు ఊరట లభించినట్లయింది. త్వరలో పూర్తి మొత్తంలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఎన్ని నిధులు విడుదలయ్యాయనే ప్రత్యేక కథనం.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి..

పంచాయతీలకు కేంద్ర మూడు నెలలకోమారు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. అయితే గత ఏప్రిల్‌ నుంచి జమ కాకపోవడంతో రాష్ట్రం నుంచి ప్రతి నెలా వచ్చేవి కూడా మూడు నెలలుగా అందకపోవడంతో సర్పంచులకు, కార్యదర్శులకు నిర్వహణ భారమైంది. ఎనిమిది నెలల అనంతరం మంజూరు కావడంతో ఊరట లభించినట్లయింది. పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే.. ఖాజానా శాఖ ద్వారా పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉండేది. కేంద్రం పంచాయతీలకు నేరుగా విడుదల చేయాలనే ఆలోచన చేసింది. పంచాయతీలతో కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిపించింది. ఆ ఖాతాలకు ఇప్పుడు నిధులు విడుదల చేసింది.

తప్పిన ఫ్రీజింగ్‌ బాధలు..

కేంద్రం ఇచ్చే నిధులను నేరుగా ఆయా పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తుండడంతో ఖాతాల ఫ్రీజింగ్‌ నుంచి బయట పడినట్లయింది. గతంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా వేరే అవసరాలకు వినియోగించుకునేది. పంచాయతీ ఖాతాలను ఫ్రీజింగ్‌లో ఉంచేది. ఇలా మూడు, నాలుగు నెలల వరకు ఖాతాలు ఫ్రీజింగ్‌లో ఉంచేది. పంచాయతీలో డబ్బులున్నా అవసరానికి వినియోగించుకోలేని పరిస్థితి నెలకొనేది. కానీ ప్రస్తుతం ఖాతాలను తెరిపించి నేరుగా జమ చేస్తుండటంతో ఆయా సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


పూర్తి మొత్తం జమ చేయాలి
- రుద్రభారతి, సర్పంచి, జూబ్లీనగర్‌, కరీంనగర్‌ గ్రామీణ మండలం

ప్రస్తుతం కేంద్ర నేరుగా నిధులు ఖాతాలు సవ్యంగా ఉన్నాయా లేదా అనేదాని కోసం ట్రయల్‌రన్‌ నిర్వహించి మొదటి విడత విడుదల చేశారు. రావాల్సిన పూర్తి మొత్తం డబ్బులు త్వరగా అందజేస్తే పల్లె ప్రజలకు మేలు చేసిన వారవుతారు. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్తు బిల్లులు బకాయిపడి ఉన్నాయి. ట్రాక్టర్‌ బ్యాంకు రుణం, పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు ఇవ్వన్నీ చెల్లించడానికి కష్టమవుతోంది. ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయాలి.


కొత్త బ్యాంకు ఖాతాల్లో జమ
-వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి, కరీంనగర్‌

పంచాయతీల్లో కొత్తగా తీసిన బ్యాంకు ఖాతాలన్నీ పీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేశాం. ఖాతాలన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ప్రతి పంచాయతీకి కొన్ని నిధులు జమ అయ్యాయి. త్వరలో పూర్తి మొత్తం రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు