logo

కార్మికులకు సామాజిక భద్రతే లక్ష్యం

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించి వివిధ సంక్షేమ పథకాలను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈశ్రమ్‌ నమోదు ప్రక్రియను ప్రారంభించింది.

Published : 25 Jan 2023 04:32 IST

ఈ-శ్రమ్‌లో నమోదుకు చర్యలు

ఈ-శ్రమ్‌ గురించి వివరిస్తున్న అధికారి

న్యూస్‌టుడే, ధర్మపురి గ్రామీణం: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించి వివిధ సంక్షేమ పథకాలను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈశ్రమ్‌ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. పథకంలో చేరిన ప్రతి ఒక్కరికి 12 అంకెల యూనివర్సల్‌ నెంబరు ఇస్తారు. ఈ కార్డు తీసుకున్న వారికి రానున్న రోజుల్లో అన్ని రకాల సామాజిక భద్రత పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు ఈశ్రమ్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద బీమా అందించనున్నారు.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు 4,47,545 మంది కార్మికులు ఈశ్రమ్‌లో నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో ప్రభుత్వ ఉద్యోగులు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఆదాయపు పన్ను కట్టేవారు మినహా ప్రతి ఒక్క కార్మికుడు చేరేందుకు అర్హులవుతారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరికి లబ్ధి చేకూర్చేందుకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర శాఖల సహాయాన్ని తీసుకుంటున్నారు. అర్హులైన వారని ఈశ్రమ్‌లో చేర్చే విధంగా కృషి చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సహాయంతో వేలాది మంది కార్మికుల పేర్లను నమోదు చేయించారు.

అన్ని వర్గాల వారికి...

అసంఘటిత రంగంలో ఉన్న అత్యధిక మందికి సామాజిక భద్రత కలిగించే పథకం ఈశ్రమ్‌. కార్మికుల సంక్షేమానికి అనేక రకాల పథకాలున్నప్పటికీ పలు వృత్తుల్లో ఉన్న వారు ఈశ్రమ్‌లో పేరు నమోదు చేయించుకునేందుకు అర్హులు. రైతులు, కుల వృత్తులు చేసుకునే వారు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు, సేవారంగం, ఇళ్లలో పనిచేసేవారు, కొరియర్‌ బాయ్స్‌, ఉపాధి హామీ కూలీలు, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇందులో చేరడం వల్ల సామాజిక భద్రత ఉంటుంది.

పరిహారం విషయంలో అందని ఆదేశాలు

ఈ శ్రమ్‌లో నమోదు చేసుకొని ప్రమాదాలకు గురైన వారి కుటుంబ సభ్యులు పొందే బీమా పరిహారం విషయంలో ఇంకా ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో అనేక మంది పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. పరిహారం విషయానికి సంబంధించి ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కార్మిక శాఖ సమావేశంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.


అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

రాజారం కృష్ణసాగర్‌, సహాయ కార్మిక శాఖాధికారి, జగిత్యాల

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈశ్రమ్‌లో నమోదు చేసుకొని లబ్ధి పొందాలి. అర్హులైన ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక చొరవ తీసుకొని నమోదు చేయిస్తున్నాం. ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా, నామినీ వివరాలతో సీఎస్సీ కేంద్రాలు, మీసేవ, అన్‌లైన్‌ ద్వారా లేదా స్మార్ట్‌ఫోన్‌లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరిహారం విషయంలో ఆదేశాలు రాగానే లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని