logo

కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ

జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వైద్య, విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 02 Feb 2023 06:01 IST

మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య, విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, తదితరులు

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వైద్య, విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి వార్డులో బాలింతల వద్దకు వెళ్లి మాట్లాడారు. ఆసుపత్రిలో డబ్బులేమైనా అడుగుతున్నారా? అని ప్రశ్నించగా అడుగుతున్నారని సమాధానం రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈనాడు’లో జనవరి 27న ‘వంశోద్ధారకుడు వచ్చాడు.. డబ్బులు ఇవ్వండి’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని చరవాణిలో వైద్య సిబ్బందికి చూపించారు. ఆపరేషన్‌ థియేటర్‌లోని సిబ్బందితో పాటు నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, వైద్యాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య గుత్తేదారుడికి నోటీసు ఇవ్వాలని, మరోసారి డబ్బులు వసూలు చేస్తే గుత్తేదారు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రితో పాటు మాతా, శిశు ఆసుపత్రిలోని పేయింగ్‌ రూమ్‌ల గురించి ఆరా తీశారు. గదులను రోగులకు ఎందుకు ఇవ్వడం లేదని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. కమిషనర్‌ పర్యటన అనంతరం సూపరింటెండెంట్‌ రత్నమాల, ప్రోగ్రాం అధికారి వాసుదేవారెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ, ఇన్‌ఛార్జి ఆర్‌ఎంఓ నవీన ఇతర వైద్య సిబ్బంది సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సమావేశమై తదుపరి చర్యలపై చర్చించారు.  

అయిదుగురు పారిశుద్ధ్య సిబ్బంది తొలగింపు

కరీంనగర్‌ సంక్షేమ విభాగం: కరీంనగర్‌ మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో బాలింతల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడిన సిబ్బందిని ఆసుపత్రి వైద్యాధికారులు గుర్తించారు. అధికారుల విచారణలో అయిదుగురు పారిశుద్ధ్య సిబ్బంది డబ్బులు తీసుకున్నారని తేలడంతో వారిని విధుల్లో నుంచి పూర్తిగా తొలగించాలని పారిశుద్ధ్య గుత్తేదారుడికి ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యాధికారుల ఉత్తర్వుల మేరకు ఐదుగురిని తొలగించినట్లు పారిశుద్ధ్య ఇన్‌ఛార్జి రాజిరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని