logo

రోడ్లపైనే వ్యాపారం

చిరు వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ రోడ్లపైన, కూడళ్లలో వ్యాపారాలు నిర్వహించకుండా వీధి వ్యాపారులకు దుకాణాల సముదాయాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Published : 03 Feb 2023 05:50 IST

నిరుపయోగంగా దుకాణ సముదాయాలు
న్యూస్‌టుడే, మెట్‌పల్లి

మెట్పల్లి పట్టణంలో రోడ్డుపై తోపుడుబండ్లు

చిరు వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ రోడ్లపైన, కూడళ్లలో వ్యాపారాలు నిర్వహించకుండా వీధి వ్యాపారులకు దుకాణాల సముదాయాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతి నిధులతో దుకాణాల సముదాయాలను నిర్మించి వ్యాపారులకు కేటాయించినా వ్యాపారం సరిగా నడవదని ఆసక్తి చూపడంలేదు. జగిత్యాల పురపాలక సంఘంలో షెడ్లు నిర్మించినా వ్యాపారుల గుర్తింపునకు సర్వే కొనసాగుతుండగా కోరుట్ల, మెట్పల్లి పురపాలికల్లో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన దుకాణాల సముదాయలు వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. రోడ్లపైనే వ్యాపారం కొనసాగిస్తుండడంతో పాదచారులు, వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  

జోన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితం

పురపాలికల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దుకాణాల సముదయాలను నిర్మించడంతోపాటు వ్యాపారాలకు జోన్ల పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చింది. మెప్మా ఆధ్వర్యంలో పురపాలికల్లో సీసీలు, ఆర్పీలు సర్వే నిర్వహించి  వీధి వ్యాపారులను గుర్తించి మూడు రకాల జోన్లు ఏర్పాటు చేశారు. పురపాలికల్లో జోన్ల విధానం ఎక్కడా అమలు కావడంలేదు. జోన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది.

గ్రీన్‌జోన్‌: ఎలాంటి ట్రాఫిక్‌ అతరాయం కలగని ప్రదేశాలు, జనం రద్దీలేని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగించడానికి అనుమతి ఇస్తారు.

ఆరెంజ్‌జోన్‌: ఓ మోస్తరు నుంచి మధ్యస్తంగా జనం రద్దీ ఉంటూ వాహనాల రాకపోకలు సాగించే ప్రధాన అంతర్గత రహదారులు, కూడళ్లను ఆరెంజ్‌ జోన్‌గా గుర్తించి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు పర్యాయాలు వ్యాపారం నిర్వహించుకోవచ్చు.

రెడ్‌జోన్‌: ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు ప్రధాన కూడళ్లు ఉండే ప్రాతాలను రెడ్‌ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి వీధి వ్యాపారాలు నిర్వహించడానికి అనమతి ఇవ్వరు.


ట్టణంలోని ప్రభుత్వ గోదాములకు వెళ్లే దారి పక్కన పట్టణ ప్రగతిలో రూ.5 లక్షలు వెచ్చించి వీధి వ్యాపారుల కోసం దుకాణాల సముదాయాన్ని నిర్మించి 25 షెడ్లు ఏర్పాటు చేశారు. అద్దె నిర్ణయించి చిరు వ్యాపారులకు కేటాయించారు. అక్కడ కొనే వారుండరని దుకాణం ఏర్పాటు చేసుకుంటే నష్టాలు వస్తాయని ఆసక్తి చూపడంలేదని ఓ వ్యాపారి తెలిపారు.


ది కోరుట్ల పట్టణంలోని కల్లూర్‌ రోడ్డులో రూ.15 లక్షలతో వీధి వ్యాపారులకు నిర్మించిన దుకాణ సముదాయం. 12 షెడ్లు ఏర్పాటు చేసి వ్యాపారులకు కేటాయించారు. దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం ఓ షెడ్డులో ఓ వ్యాపారి పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు. మిగతా షెడ్లన్నీ నిరుపయోగంగా ఉన్నాయి.


అవగాహన కల్పిస్తాం

సునీత, మెప్మా డీఎంసీ, జగిత్యాల

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పురపాలక సంఘాల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక దుకాణాల సముదాయం ఏర్పాటు చేశాం. జగిత్యాలలో వ్యాపారుల గుర్తింపుకు సర్వే జరుగుతోంది. మెట్పల్లి, కోరుట్లలో వ్యాపారులకు కేటాయించినా నిర్వహణకు ముందుకు రావడంలేదు. వారికి అవగాహన కల్పిస్తాం. దుకాణాల సముదాయాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని