logo

కాలువలు ఇలా.. నీరు పారేదెలా?

ధ్వంసమైన లైనింగ్‌.. గండ్లతో బలహీనపడిన చిన్నకట్టలు.. కాలువలో మొలిచిన చెట్లు.. నిర్మిత సామర్థ్యంలో కనీసం సగం నీరు ప్రవహించడం ఆయా గ్రామాల పరిధిలో కష్టమవుతోంది.

Published : 03 Feb 2023 05:50 IST

ఈనాడు, కరీంనగర్‌

ధ్వంసమైన లైనింగ్‌.. గండ్లతో బలహీనపడిన చిన్నకట్టలు.. కాలువలో మొలిచిన చెట్లు.. నిర్మిత సామర్థ్యంలో కనీసం సగం నీరు ప్రవహించడం ఆయా గ్రామాల పరిధిలో కష్టమవుతోంది. జలవనరులు అధికంగా ఉన్న జిల్లాలో తూములు, అలుగులకు అనుబంధంగా ఏర్పాటైన చిన్ననీటి వనరుల విషయంలో నిధులు లేక నిర్లక్ష్యం కనిపిస్తోంది. అక్కడక్కడ ఉపాధి హామీ పథకంలో పిచ్చిమొక్కలను తొలగించి చిన్నపాటి పనులు జరిపించినా అవి ఉపయుక్తంగా మారలేదు. వర్షాకాలంలో వీటిలో పారాల్సిన నీళ్లని సమీప పొలాలతోపాటు ఇళ్ల మధ్యకు చేరిన సందర్భాలు జిల్లాలో ఉన్నాయి. ఈ తీరు మారాలంటే ఇప్పటికే గుర్తించిన పనులను ప్రాధాన్యం క్రమంగా చేపట్టాలి. కొత్త పనుల అంచనాకు తగినట్లుగా నిధుల ప్రతిపాదనలను మరోసారి పంపాలి. ఈ వేసవి పూర్తయ్యే లోపల ఉన్న ఈ మూడు నెలలను పనుల ప్రగతికి అనువైన కాలంగా మార్చుకోవాలి.


ఇది హుజూరాబాద్‌ మోడల్‌ చెరువు నుంచి కిందనున్న పంట పొలాలకు నీళ్లను పారించే చిన్నకాలువ. కొన్నేళ్ల కిందటి నుంచి మరమ్మతు అంటే ఎరుగక ఇలా అధ్వానస్థితికి చేరింది. దీన్ని బాగు చేయాలనే విషయాన్ని మర్చిపోవడంతో కాలువ లోతు మట్టితో పూడుకుపోవడంతోపాటు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగి రూపు కోల్పోతోంది. అన్నదాతలు పలుమార్లు విన్నవించుకున్నా.. నిధుల మంజూరు ఊసే లేక ఇబ్బంది తలెత్తుతోంది.


ఎక్కడికక్కడే ఇలా..

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుంచి జిల్లాలోని గంగాధర మండలం నారాయణపూర్‌, గంగాధర జలాశయాలకు నీళ్లను అందించే రెండు కాలువలు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. 22 కి.మీ మేర పైపుల ఏర్పాటుతోపాటు గ్రావిటీ కాలువల పనులు ఏళ్లతరబడి కొనసాగుతుండటంతో అసౌకర్యం ఏర్పడుతోంది.

ఎల్‌ఎండీ జలాశయం నుంచి 1500 నుంచి 3 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తరలించే సామర్థ్యమున్న కాకతీయ కాలువల ఆధునికీకరణ ప్రక్రియ అటకెక్కింది. ఏడాది పొడవునా పలు జిల్లాలకు నీరందించే వీటిని బాగు చేయడానికి వందలాది కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు.

కాకతీయ కాలువకు, చెరువులు, చెక్‌డ్యామ్‌లకు అనుబంధంగా మానకొండూర్‌, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్‌, చిగురుమామిడి, తిమ్మాపూర్‌ల పరిధిలోనే వందలాది కి.మీ మేర విస్తరించిన కాలువల చెంతన సిమెంట్‌ పనులే జరగక వ్యవస్థ దెబ్బతింటుంది.

డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థతోపాటు తూములను చాలాచోట్ల బాగు చేయించాలి. చాలా ఊళ్లల్లో చివరి ఆయకట్టుకు నీరు అందడమనేది కష్టంగా మారుతోంది. పైగా సిమెంట్‌ లైనింగ్‌ ఉన్నవాటిలో పగుళ్లు, బుంగలు పడి సాగునీరంతా చాలాచోట్ల వృథా అవుతోంది. పలుచోట్ల ఇవి కుచించుకుపోయాయి.


ఇటీవల కురిసిన వర్షాలకు నూతనంగా నిర్మించిన కాలువ మట్టి ఇలా తొలిగిపోయింది. కాకతీయ కాలువకు అనుబంధంగా మానకొండూర్‌ మండలం చెంజర్ల గ్రామశివారులో దీన్ని గతేడాది కిందట జలధారలు పారేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. వరదల ఉద్ధృతితో రూపు కోల్పోయిన దీనికి ఇరువైపులా కొన్ని చోట్ల సిమెంట్‌ లైనింగ్‌ వేసి.. రోడ్డుకు అవతలి వైపు పంట పొలాలకు నీళ్లు వెళ్లే మార్గాన్ని మరమ్మతు చేయాల్సిన అవసరముంది.


సర్వే చేపడితేనే..

ఐదారేళ్ల కిందట కాలువల మరమ్మతుకు పంపిన ప్రతిపాదనల్లో అనుకున్న విధంగా నిధులు జిల్లాకు రావడంలేదనే మాటలను సంబంధిత పర్యవేక్షణ అధికారులే ఊళ్లకు వచ్చినప్పుడు ప్రజలకు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్య మరింత పెరిగిపోయింది. అందువల్ల మరోసారి 313 గ్రామాలతోపాటు పట్టణాల చెంతన ఉన్న వీటిని పూర్తి స్థాయిలో సర్వే చేపట్టాల్సిన అవసరముంది. దెబ్బతిన్న వాటిని గుర్తించడంతోపాటు బాగు చేసేందుకు నిధులను అంచనా వేయాలి. ప్రజాప్రతినిధులు చొరవచూపి నిధులు మంజూరు చేయించాలి. అలా చేస్తేనే వీటి రూపు మారే వీలుంటుంది. జిల్లాలో వీటి బాగుకు నిధులు వస్తున్నవాటిని బట్టి పనులు చేపడతామని.. ఇటీవల కొత్త మంజూరు లేక ఇబ్బంది నెలకొందని నీటి పారుదల శాఖ ఎస్‌ఈ శివకుమార్‌ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని