logo

లోపించిన భద్రత.. నిబంధనలకు పాతర

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.

Updated : 03 Feb 2023 06:06 IST

స్మార్ట్‌సిటీ వరద కాలువ నిర్మాణంలో నిర్లక్ష్యం
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌, కరీంనగర్‌ పట్టణం

రీంనగర్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ప్రధానంగా వరద కాల్వ నిర్మాణ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీది కన్సల్టెన్సీ, సంబంధిత ఏజెన్సీనే పర్యవేక్షణ చేస్తుందని అంటున్న నగరపాలిక ఇంజినీరింగ్‌ అధికారులు..కనీసం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన వారే కరవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనులు జరుగుతున్న చోట స్థానికులకు అవగాహన కల్పించకపోవడం, ప్రమాదాలు జరిగితే బాధ్యుల ఎవరనే విషయాన్ని గుర్తించడం లేదు. ఇదే తరహాలో తిరుమల్‌నగర్‌లో కార్మికులు వరద కాల్వ పనులు చేస్తుండగా బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంటి గోడ కూలి ఓ కార్మికుడు చనిపోవడం ఆ ప్రాంతవాసులను కలచి వేసింది. ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.


గణేశ్‌నగర్‌ బైపాసు, హనుమాన్‌నగర్‌లో ప్రధాన వరద కాల్వ నిర్మాణ పనులకు డిసెంబరు 26న ఎడాపెడా తవ్వడంతో ఓ అపార్టుమెంట్‌ దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌, స్తంభాలు కుప్పకూలాయి. రాత్రిపూట కావడంతో అటు రాకపోకలు సాగించలేదు. లేదంటే భారీ ప్రమాదం జరిగేది.


కదులుతున్న పునాదులు..

వరదకాల్వ నిర్మాణ పనులను స్మార్ట్‌సిటీలో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పనులు ప్రారంభించిన సదరు ఏజెన్సీ పాత కాల్వల గుండా తవ్వడం ప్రారంభించారు. ఇంటి గోడలకు అనుకొని తవ్వుతుండటంతో పునాదులు కూడా కదులుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. లోతుగా తవ్వుతుండటంతో ఇంటి పునాదులు ఆ మేరకు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. మట్టి కూలి ప్రమాదకరంగా మారుతున్నాయని ఆగ్రహిస్తున్నారు. తిరుమల్‌నగర్‌లో ఇదే పరిస్థితి ఉండగా గణేశ్‌నగర్‌ బైపాసు రోడ్డులో కూడా అలాగే తవ్వారు.

పనుల్లో జాప్యం

ఎడాపెడా తవ్వుతుండగా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించడం లేదు. ఒకటెండ్రు చోట్ల త్వరతిగతిన చేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో సాలక అల్లి వదిలేస్తున్నారు. రాకపోకలు సాగించడం కూడా గగనంగా మారుతోంది. ప్రస్తుతం తిరుమల్‌నగర్‌, గణేశ్‌నగర్‌ బైపాసు రహదారి, కట్టరాంపూర్‌ రోడ్డు, కోతిరాంపూర్‌ ప్రధాన రహదారి, రాజా థియేటర్‌ వైపు, పాసుపోర్టు కార్యాలయం వైపు రోడ్లు, డ్రైనేజీల పనులు సాగుతున్నాయి. గణేశ్‌నగర్‌ బైపాసు, తిరుమల్‌నగర్‌ చుట్టూ పనులు చేస్తుండగా రాకపోకలు సాగించే ప్రజలు నానావస్థలు పడుతున్నారు.


ఈనెల 1న సాయంత్రం 5 గంటలకు తిరుమల్‌నగర్‌లో అంతర్గత ప్రధాన కాల్వ నిర్మాణ పనులు చేస్తుండగా ఇంటికి సంబంధించిన ప్రహరీ సాలక అల్లుతున్న కార్మికులపై పడింది. ఆ సమయంలో అక్కడ ముగ్గురు కార్మికులు ఉండగా ఇద్దరికి గాయాలు కాగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.


అప్రమత్తత ఏదీ?

వరదకాల్వ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో అటుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా భద్రత చర్యలు తీసుకోవాలి.

బారికెడ్లు, రెడ్‌ రిబ్బన్లు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉండగా అది కనిపించడం లేదు. ఆ వైపు పనులు జరుగుతున్నట్లుగా హెచ్చరిక బోర్డులు ఉండాలి.

ఫ్లెక్సీలతో రాసి ఎక్కడో మూలన ప్రదర్శిస్తుండటంతో అవి ప్రజలకు స్పష్టంగా కనిపించడం లేదు.

పని చేస్తున్న కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలి. తలకు కచ్చితంగా హెల్మెట్లు ధరించేలా పర్యవేక్షించడం లేదు.

అనుకొని ఘటన జరిగితే వారి కుటుంబానికి నష్ట పరిహారం అందేలా బీమా సౌకర్యం ఉండాలి. ప్రతి ఒక కార్మికుడికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి.

పనులు చేస్తున్న ప్రాంతంలో కచ్చితంగా కంపెనీ తరపున అంబులెన్స్‌ సిద్ధంగా ఉంచాలి.


ముందస్తుగానే భద్రతపై సూచిస్తున్నాం

స్మార్ట్‌సిటీ పనులు చేస్తున్న సమయంలో సంబంధిత ఏజెన్సీకి ముందస్తుగానే రక్షణ, భద్రత చర్యలు తీసుకునేలా ఎప్పటికప్పుడూ ఆదేశాలు ఇస్తున్నాం. పనులు జరుగుతున్న సమయంలో బోర్డులు ఉంటాయి. బిట్ల వారీగా పనులు చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. త్వరగా పూర్తి చేయిస్తాం.

నాగ మల్లేశ్వరరావు, ఎస్‌ఈ, నగరపాలిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని