logo

వేలిముద్ర పడాల్సిందే!

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం తిరిగి పట్టాలెక్కింది. జగిత్యాల జిల్లాలో రెండు రోజులుగా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హాజరు యంత్రాల్లో నమోదు చేస్తున్నారు. క

Updated : 03 Feb 2023 06:08 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదలైన బయోమెట్రిక్‌
న్యూస్‌టుడే, మెట్‌పల్లి

మెట్పల్లి కళాశాలలో ప్రిన్సిపల్‌ పర్యవేక్షణలో హాజరు నమోదు చేస్తున్న అధ్యాపకులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం తిరిగి పట్టాలెక్కింది. జగిత్యాల జిల్లాలో రెండు రోజులుగా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హాజరు యంత్రాల్లో నమోదు చేస్తున్నారు. కళాశాలల్లో ప్రతిరోజు నమోదైన హాజరు శాతం జిల్లా నోడల్‌ అధికారి కార్యాలయంలో పరిశీలించేలా అనుసంధానం చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది కళాశాలకు రాగానే ఉదయం 9.30 గంటలకు సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు 4 గంటలకు బయోమెట్రిక్‌ యంత్రాల్లో హాజరు నమోదుచేయాల్సి ఉంటుంది.

ఆరేళ్ల క్రితమే..

కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది స్థానికంగా ఉండక దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడం, సమయపాలన పాటించక పోవడంవల్ల తరగతుల నిర్వహణకు ఇబ్బంది కలుగుతుందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం 2016-17 విద్యా సంవత్సరంలో బయోమెట్రిక్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అధునాతన హాజరు నమోదు యంత్రాలను ప్రవేశపెట్టారు. కొన్ని చోట్ల యంత్రాలు మొరాయించడం, సాంకేతిక లోపాలు తలెత్తాయి. వీటికి తోడు మూడేళ్ల క్రితం కరోనా వైరస్‌ కారణంగా ప్రత్యక్ష తరగతులు నిలిచిపోయాయి. బయోమెట్రిక్‌ హాజరు మూలకు చేరింది. వినియోగంలో లేకపోవడంతో యంత్రాలు పనిచేయకుండా పోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కొత్త యంత్రాలు ఏర్పాటు చేశారు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించారు. ఆయా కళాశాలల్లో ప్రిన్సిపల్స్‌, బోధన, బోధనేతర సిబ్బంది వేలిముద్రలు నమోదు చేశారు. మంగళవారం నుంచి వీరంతా బయోమెట్రిక్‌ హాజరు వినియోగంచుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అమలు చేయనున్నారు.


పెరగనున్న పారదర్శకత

నారాయణ, ఇంటర్‌ జిల్లా నోడల్‌ అధికారి, జగిత్యాల

అధ్యాపకులతో పాటు బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్‌తో హాజరు నమోదు చేయాలని ఆదేశాలు అందాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేసేలా ఏర్పాటు చేశాం. వేలిముద్రలతోనే హాజరు నమోదు చేయాలి. రెండు రోజుల నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో బయోమెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. దీంతో అధ్యాపకులు, సిబ్బంది హాజరు శాతం మెరుగుపడడంతో పాటు పారదర్శకత పెరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా రికార్డుల్లో హాజరు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని