logo

టిఫా సదుపాయం.. గర్భిణులకు వరం

గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ‘టిఫా’ సదుపాయం అందుబాటులోకి రావడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన గర్భిణులకు తిప్పలు తప్పాయి.

Updated : 03 Feb 2023 05:57 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ‘టిఫా’ సదుపాయం అందుబాటులోకి రావడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన గర్భిణులకు తిప్పలు తప్పాయి. గర్భంలో శిశువు ఆరోగ్య స్థితిగతులపై 18 నుంచి 23 వారాల్లోగా ‘టిఫా’(టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫెటల్‌ ఎనామలీస్‌) స్కానింగ్‌ తప్పని సరి. నవంబరు చివరి వారం నుంచి గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ‘టిఫా’ స్కానింగ్‌ సేవలు మొదలయ్యాయి. గతంలో ఈ స్కానింగ్‌ కోసం గోదావరిఖనితో పాటు కరీంనగర్‌, మంచిర్యాలలోని ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఖర్చుతో కూడుకొని ఉండటంతో ఆర్థిక భారం పడేది. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారు అత్యధికంగా నిరుపేదలే. వారికి ఇబ్బందులు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తోంది.

స్కానింగ్‌ చేస్తున్న వైద్యురాలు డాక్టర్‌ సుప్రియ

ఎంతో ప్రయోజనం...

గర్భంలో శిశువు ఎదుగుదల సరిగా లేకపోవడంతో పాటు శారీరక, మానసిక వైకల్యం ఉన్నట్లయితే ‘టిఫా’ స్కానింగ్‌లో తెలిసే అవకాశముంటుంది. అందుకు అనుగుణంగా చికిత్సలు నిర్వహించే అవకాశముంది. అందుకే తప్పనిసరిగా ప్రతి గర్భిణీ ‘టిఫా’ స్కానింగ్‌ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ‘టిఫా’ స్కానింగ్‌ మిషన్‌తో పాటు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేసేందుకు ఒక్కరే రేడియోగ్రాఫర్‌ ఉండడంతో ప్రతి రోజు సుమారుగా 50 వరకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేస్తుండగా ‘టిఫా’ మాత్రం ఒకటి, తప్పనిసరైతే రెండు వరకు చేస్తున్నారు. టిఫా కోసం వచ్చే గర్భిణుల వివరాలను నమోదు చేసుకుంటూ వారికి తేదీని కేటాయిస్తున్నారు.

సిబ్బంది కొరత నివారిస్తే మేలు

స్కానింగ్‌కు సంబంధించి ఎన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా కీలకమైన రేడియోగ్రాఫర్ల నియామకం తప్పనిసరి. లేకుంటే సేవలు నామమాత్రమే కానున్నాయి. గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో టిఫా, అల్ట్రాసౌండ్‌, సీటీస్కాన్‌ సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ రేడియాలజీ విభాగంలో మాత్రం ఒక్కరే ఉండడంతో ఆశించిన మేరకు స్కానింగ్‌ సేవలు ప్రజలకు అందడం లేదు. సార్వజనిక ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో ఒక ఆచార్యులు, ఇద్దరు సహ ఆచార్యులు, ఐదుగురు సహాయక ఆచార్యులు ఉండాల్సి ఉండగా గోదావరిఖనిలో మాత్రం ఒకే సహాయక ఆచార్యులు ఉన్నారు. స్కానింగ్‌కు రద్దీ ఎక్కువగా ఉండగా అవసరమైన వారికి ప్రత్యేక తేదీ, సమయం కేటాయించి సేవలు అందిస్తున్నారు. సీటీస్కాన్‌ కోసం ఓ ఒప్పంద ఉద్యోగికి శిక్షణ ఇచ్చి నిర్వహణ చేపట్టనున్నట్లు సమాచారం.


సీటీస్కాన్‌ ప్రారంభానికి సన్నాహాలు

సింగరేణి కాలరీస్‌ నిధులతో గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీటీస్కాన్‌ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ట్రయల్‌ రన్‌ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. మరో వారం రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రమాదాల్లో గాయపడి నిత్యం అనేక మంది వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుంటారు. తలకు తీవ్ర గాయాలైన సమయంలో తప్పనిసరిగా సీటీస్కాన్‌ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో వారిని ప్రైవేటుకేంద్రాలకు లేదంటే కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం చేస్తుంటారు. దూరాభారంతో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉండగా ప్రైవేటులో ఈ స్కాన్‌కు అధికంగా ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సేవలు మొదలైతే ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు