logo

మళ్లీ అదే తంతు!

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సోమవారమూ గతంలో మాదిరిగా మొక్కుబడిగా జరిగాయి. ఏడు స్థాయీ సంఘ సమావేశాలు ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ ఛాంబర్‌లోనే జరిపారు.

Published : 07 Feb 2023 06:03 IST

నామమాత్రంగా స్థాయీ సంఘ సమావేశాలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, జడ్పీటీసీ సభ్యురాలు సౌజన్య, సీఈవో ప్రియాంక

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సోమవారమూ గతంలో మాదిరిగా మొక్కుబడిగా జరిగాయి. ఏడు స్థాయీ సంఘ సమావేశాలు ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ ఛాంబర్‌లోనే జరిపారు. మహిళా సంక్షేమం స్థాయీ సంఘం ఛైర్‌పర్సన్‌ పిట్టల కరుణ గైర్హాజరయ్యారు. సంక్షేమ స్థాయీ సంఘ సమావేశానికి ఛైర్‌పర్సన్‌ మాచర్ల సౌజన్య హాజరు కాగా సభ్యులెవరూ రాకపోవడంతో మొక్కుబడిగా పూర్తి చేశారు. సమావేశం పూర్తయ్యాక కోఆప్షన్‌ సభ్యులు శుక్రుద్దీన్‌ వచ్చారు. 5, 6 స్థాయీ సంఘ సమావేశాలు మినహా మిగిలినవి 1,2,3,4,7 విడివిడిగా కాకుండా అన్ని కలిపి ఛైర్‌పర్సన్‌ విజయ అధ్యక్షతన జరిగాయి.

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ  సమావేశం ఏదీ?

కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు ఎందుకు నిర్వహించడంలేదు, మూడేళ్లుగా అడుగుతున్నా ఎందుకు స్పందించడంలేదని శంకరపట్నం జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహించారు. ఆర్‌ఎంవో జ్యోతి చెప్పిన సమాధానంతో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైనా మండల విద్యాధికారి ఎందుకు హాజరు కాలేదని మండిపడ్డారు. డీఈవో ఫోన్‌ చేస్తే సరిగా మాట్లాడటంలేదన్నారు. ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచాలని, మొక్కలు అందుబాటులో ఉంచాలని ఛైర్‌పర్సన్‌ విజయ సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన పాడి పశువులు సరిగా పాలు ఇవ్వడంలేదని హుజూరాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు బక్కరెడ్డి ఆరోపించారు. మిషన్‌ భగీరథ పనుల కోసం తవ్విన రోడ్లు, మళ్లీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.

ఇళ్ల నిర్మాణంలో జాప్యమెందుకు?

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు చిన్నకోమటిపల్లిలో ఇతర ప్రాంతాల్లో ఎందుకు ఆగిపోయాయని ఛైర్‌పర్సన్‌ విజయ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు గుత్తేదారులు ఆసక్తి చూపించడం లేదని ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కొందరు రాక్షసులుగా మారారని ఛైర్‌పర్సన్‌ మండిపడ్డారు. మండల పంచాయతీరాజ్‌ ఏఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయడంలేదని చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యుడు గీకురు రవీందర్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ తమ ఫోన్లకు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, ఆమెను అక్కడి నుంచి బదిలీ చేయాలని అధికారులను ఛైర్‌పర్సన్‌ విజయ ఆదేశించారు. సమావేశాలకు సగం మందికి పైగా సభ్యులు హాజరు కాలేదు. జడ్పీ సీఈవో ప్రియాంక, వైస్‌ ఛైర్మన్‌ గోపాల్‌రావు, జడ్పీటీసీ సభ్యులు పురమల్ల లలిత, రవీందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని