logo

విద్యుత్తు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా

వినియోగదారులు చట్టపరిధిలో హక్కుల కోసం ప్రశ్నించాలని, ఇదే సమయంలో తమ బాధ్యతను గుర్తెరగాలని విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్‌ శ్రీరంగరావు అన్నారు.

Published : 07 Feb 2023 06:03 IST

ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు
వినియోగదారులతో ముఖాముఖి

మాట్లాడుతున్న ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: వినియోగదారులు చట్టపరిధిలో హక్కుల కోసం ప్రశ్నించాలని, ఇదే సమయంలో తమ బాధ్యతను గుర్తెరగాలని విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్‌ శ్రీరంగరావు అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా విద్యుత్తు వినియోగదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి ఛైర్మన్‌తోపాటు ఈఆర్‌సీ సభ్యులు ఎం.డి.మనోహర్‌రాజు, బి.కిష్టయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరంగరావు మాట్లాడుతూ.. ప్రజల సమస్య పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వారికి జరిమానా విధిస్తారన్నారు. ఈఆర్‌సీ ముద్రించిన ‘విద్యుత్తు పంపిణీదారుల పనితీరు ప్రమాణాలు’ అనే పుస్తకం ప్రతి విద్యుత్తు అధికారి, ఉద్యోగి చదవాలని సూచించారు. వినియోగదారుల హక్కులు, బాధ్యతలను ప్రజాప్రతినిధులు తెలుసుకొని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నియంత్రిక కాలిపోతే ఖర్చులు సంస్థనే చెల్లించాలన్నారు.

ముందస్తు నోటీసు ఇచ్చాకనే..

విద్యుత్తు టవర్‌ ఏర్పాటుకు ముందు భూయజమానికి తప్పనిసరిగా నోటీస్‌ ఇవ్వాలని, దానికి మండల కార్యాలయంలో నిర్దేశించిన పరిహారం ఇవ్వాలన్నారు. ప్రజలు యూనిట్‌కు చెల్లిస్తున్న ధరలో 70 పైసలు ఉద్యోగులు, అధికారుల వేతనాలకు ఖర్చు చేస్తున్నారని, దీనికి అనుగుణంగా పంపిణీ సంస్థలు పనితీరు మెరుగపర్చుకోవాలన్నారు. ఏసీడీ ఛార్జీలకు ప్రభుత్వానికి సంబంధంలేదని, ఈఆర్‌సీ అనుమతితోనే పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్నాయన్నారు. ఇందుకు ముందస్తుగా నోటీసు ఇవ్వకపోవడం పంపిణీ సంస్థల తప్పేనని తేల్చి చెప్పారు. వినియోగదారులకు మర్యాద ఇవ్వకపోతే 040-23311127, 28కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సీజీఆర్‌ఎఫ్‌ ఛైర్మన్‌ సత్యనారాయణగౌడ్‌, ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ ముఖాముఖిలో పలువురు అడిగిన ప్రశ్నలకు ఎస్‌ఈ గంగాధర్‌ సమాధానం ఇచ్చారు.


సమయపాలన లేకుండా సరఫరా

వ్యవసాయ విద్యుత్తు సరైన షెడ్యూల్‌ లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వినియోగదారులకు నోటీస్‌ ఇవ్వకుండానే ఏసీడీ ఛార్జీల వసూలు చేస్తున్నారు. టోల్‌ఫ్రీ నంబరును, అధికారుల చరవాణి నంబర్లు విస్తృత ప్రచారం కల్పించాలి. ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున సీజీఆర్‌ఎఫ్‌లు ఏర్పాటు చేయాలి. కార్యాలయాల్లో ప్రజలకు కనీస మర్యాద ఇవ్వడంలేదు.

సంపత్‌రావు, భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రతినిధి


శిథిల స్తంభాలు తొలగించాలి

శిథిలమైన, అవసరంలేని స్తంభాలు తొలగించించాలి. పాత ఇళ్లు తొలగించి కొత్తవి నిర్మించే వారికి కమర్షియల్‌ అంటూ ముందస్తు సమాచారం లేకుండా బిల్లులు ఇస్తున్నారు. వీధిగా సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఏసీడీపై అవగాహన కల్పించకుండానే కరెంటు బిల్లుల్లో నమోదు చేశారు.

పెద్దపల్లి జితేందర్‌, కార్పొరేటర్‌


వదులు తీగలతో  ప్రమాదం

వదులు తీగల(లూజ్‌లైన్లు)ను సరి చేయాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. రైతులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై మండల పరిషత్‌లో తీర్మానాలు చేసినా పట్టించుకోవడంలేదు. జనాభా ఎక్కువగా ఉన్న రామడుగు మండలంలో ప్రత్యేకంగా సెక్షన్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలి. అవగాహన లేనివారితో బిల్లింగ్‌ చేయిస్తుండటంతో, వేలల్లో బిల్లులు వస్తున్నాయి.  

కోల రమేశ్‌, సర్పంచి, దేశ్‌రాజ్‌పల్లి


నియంత్రికలు తరలించేది రైతులే

నియంత్రికలను సొంత డబ్బులతో రైతులే తరలిస్తున్నారు. విద్యుత్తు సంస్థ వాహనాలను అందుబాటులో పెట్టాలి. రైతులకు విద్యుత్తు సేవలు సకాలంలో అందడంలేదు. శివారు కాలనీలకు లైన్లు వేయడానికి డబ్బులు చెల్లించమంటున్నారు. విద్యుత్తు సంస్థలో ఎంబీ పుస్తకం రాసే వారికి అవగాహన లేదు. దీనిపై వారికి శిక్షణ ఇప్పించాలి. కొందరు సిబ్బంది ప్రజలకు గౌరవం ఇవ్వడంలేదు.

బొల్లం మురళి, సర్పంచి, నిజాయితీగూడెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని