logo

కొత్త యాప్‌.. హాజరు గల్లంతు

హాజరుతో పాటు పనుల్లో అక్రమాలు వెలుగు చూసిన క్రమంలో జాతీయ ఉపాధిహామీ పథకంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాప్‌ కూలీల వేతనాలపై ప్రభావం చూపుతోంది.

Published : 07 Feb 2023 06:03 IST

వేతనాలు కోల్పోతున్న ఉపాధి కూలీలు
న్యూస్‌టుడే, గోదావరిఖని

కమాన్‌పూర్‌ మండలం గుండారంలో పనులు చేస్తున్న ఉపాధి కూలీలు

హాజరుతో పాటు పనుల్లో అక్రమాలు వెలుగు చూసిన క్రమంలో జాతీయ ఉపాధిహామీ పథకంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాప్‌ కూలీల వేతనాలపై ప్రభావం చూపుతోంది. యాప్‌ద్వారా కూలీల హాజరు గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా అమలులోకి వచ్చిన ఈ విధానంతో తాము నష్టపోతున్నామని ఉపాధి కూలీలు వాపోతున్నారు. సర్వరు సక్రమంగా రాకపోగా సమయానికి కొన్ని నిమిషాలు ఆలస్యమైనా అందులో నమోదు కావడం లేదు. ఇది వరకు రాతపూర్వకంగా వేసే హాజరు స్థానంలో ఎన్‌ఎంఎంఎస్‌(నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం) విధానాన్ని తీసుకువచ్చారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి తీసుకువచ్చిన యాప్‌తో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సైతం వారికి హాజరు వేయలేకపోతున్నారు.

అక్రమాలకు చెక్‌

పాత విధానంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. కూలీలు రాకున్నా వచ్చినట్లు.. పనులు చేయకున్నా చేసినట్లు నమోదు చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా వచ్చిన ఎన్‌ఎంఎంఎస్‌ విధానం ద్వారా వాటికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. పాత విధానంలో హాజరు, చేసిన పనుల వివరాలు సామాజిక తనిఖీల్లో అనేక సార్లు తప్పుగా వెలుగు చూశాయి. కొత్త యాప్‌ ద్వారా కూలీల చిత్రాలను పని స్థలంలోనే తీసి అంతర్జాలంలో నమోదు చేయాలి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే యాప్‌ అందుబాటులో ఉంటుంది. ఈ సమయాల్లోనే కూలీల చిత్రాలు ఆప్‌లోడ్‌ చేయాలి. ఈ సమయాల్లో కూలీలు అందుబాటులో లేకపోయినా.. సర్వర్‌ మొరాయించినా కూలీల హాజరు నమోదు కాదు. దీంతో వారికి ఆరోజు వేతనాలు జమకావు.


ఆర్థికంగా నష్టపోతున్నాం

కొత్త విధానం ద్వారా చాలాసార్లు హాజరు పడటం లేదు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. హాజరు నమోదు చేసుకునే సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా తీసుకోవడం లేదు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రత్యేక సమయంలోనే నమోదు చేసుకోవాలి. అప్పుడే ఆ రోజు చేసిన పని లెక్కలోకి వస్తుంది. ఉదయం నమోదై సాయంత్రం హాజరు పడకపోయినా రోజంతా పనిచేయనట్లే వస్తోంది.

దాసరి శ్యామల, కూలీ, పెంచికల్‌పేట


సాంకేతిక సమస్యలను సవరిస్తున్నాం

కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. కొత్త యాప్‌ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వేసవి కాలం నాటికి పూర్తిస్థాయిలో సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. సర్వర్‌ సమస్యతో పాటు పని స్థలంలో అంతర్జాలం అందుబాటులో లేకపోయినా ఇబ్బంది వస్తుంది. కింది స్థాయి సిబ్బంది నుంచి సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నాం. వాటిని అధిగమించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాం.

శ్రీధర్‌, డీఆర్‌డీఓ పీడీ, పెద్దపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని