logo

ఈసారైనా వంతెన పూర్తయ్యేనా?

ఏటా భారీ వర్షాలకు నిర్మాణ దశలోనే కూలుతున్న వేములవాడలోని మూలవాగు వంతెన పనులు మళ్లీ మొదలయ్యాయి. ఈసారైనా పూర్తవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 08 Feb 2023 06:14 IST

మళ్లీ ప్రారంభమైన పనులు
న్యూస్‌టుడే, వేములవాడ

గత ఏడాది నిర్మించిన వంతెన ఒక భాగం

ఏటా భారీ వర్షాలకు నిర్మాణ దశలోనే కూలుతున్న వేములవాడలోని మూలవాగు వంతెన పనులు మళ్లీ మొదలయ్యాయి. ఈసారైనా పూర్తవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు మొదలు పెట్టినప్పటి నుంచి మూడు సార్లు పిల్లర్ల దశలోనే కూలిపోయింది. వర్షాకాలంలో భారీ వర్షాలకు మళ్లీ కూలుతుందని గుత్తేదారు భీమ్‌ల నిర్మాణానికి అల్లిన సలాకను తొలగించారు. ప్రస్తుతం పనులు మొదలు కావడంతో ఈ సారైన పూర్తి చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు, స్థానికులు భావిస్తున్నారు.

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వేములవాడ మూలవాగు పాత వంతెనకు ఇరువైపులా రెండు వంతెనల ఏర్పాటుతో పాటు వాటి వద్ద కూడలి ఏర్పాటు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు 2015లో కోర్‌నెట్‌ నిధులు రూ. 28 కోట్లు కేటాయించారు. ఇందులో రెండు వంతెనల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారు. నిధులు విడుదల కావడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మికత ఉట్టి పడేలా డిజైన్‌ చేయడంతో పాటు పాత వంతెనకు ఇరువైపులా 12 మీటర్ల వెడల్పు, 190 మీటర్ల పొడవుతో రెండు వంతెనలు నిర్మించడానికి రూపకల్పన చేశారు. పడమటి వైపు పూర్తి చేసి మూడేళ్ల క్రితం మహా శివరాత్రి సందర్భంగా వంతెనను ప్రారంభించడంతో కొంత మేరకు భక్తులు, ప్రయాణికుల కష్టాలు తొలగాయి.

వేములవాడ మూలవాగులో చేపడుతున్న పనులు

మూడుసార్లు అంతరాయం

మూలవాగులోని పాత వంతెనకు తూర్పు వైపు నిర్మిస్తున్న వంతెన సెంట్రింగ్‌ దశలోనే భారీ వర్షాలకు మూడు సార్లు కూలిపోయి పనులకు అంతరాయం ఏర్పడింది. పనులు మొదలు పెట్టి భారీ పిల్లర్లు కట్టి కొంత మేర భీమ్‌ల నిర్మాణం పూర్తి చేశారు. భీమ్‌లపై శ్లాబ్‌ వేసే దశలో 2019 సెప్టెంబరులో భారీ వర్షాలకు సెంట్రింగ్‌ సపోర్టు కర్రలు కొట్టుకుపోయి భీమ్‌ వంగి కూలిపోయింది. అప్పటి నుంచి వరదలకు భీమ్‌ల నిర్మాణానికి స్టీల్‌ అల్లుతున్న క్రమంలో సపోర్టు కర్రల అడుగు భాగంలో ఇసుక కొట్టుకుపోయి కుంగిపోవడం, కొట్టుకుపోవడం జరుగుతూనే ఉంది. ఏటా ఇలా జరగడం పరిపాటిగా మారింది. వంతెన నిర్మాణంలో అయిదు స్టేజీలుండగా మొదటి దశలోనే కూలిపోవడం పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ వస్తోంది. ఇలా మూడు సార్లు ఆదిలోనే కూలి గుత్తేదారుకు నష్టం ఏర్పడింది. వాస్తవానికి ఇది 2018లోనే పూర్తి చేయాల్సి ఉంది. పనుల ఆరంభం నుంచి ఏటా వర్షాలు పెద్ద అడ్డంకిగా మారడంతో ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. ఈసారైనా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.


వర్షాలు పడేలోపు..

- సతీష్‌, ఏఈ ఆర్‌అండ్‌బీ, వేములవాడ

రెండో వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. గతంలో పనులు చేసిన గుత్తేదారే మళ్లీ చేస్తున్నారు. వర్షాలు పడే లోపు రెండు స్టాండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి అవకాశం ఉంది. వంతెన చివరిన స్థల సేకరణ జరుగుతోంది. అది పూర్తి కాగానే పూర్తిస్థాయిలో నిర్మాణానికి అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని