logo

బదిలీ ప్రక్రియకు ఆటంకం!

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ఆగుతూ..సాగుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో మరోసారి ప్రతిబంధకం ఏర్పడింది.

Published : 09 Feb 2023 05:24 IST

317 జీవో ఉపాధ్యాయులకూ అవకాశం
న్యూస్‌టుడే-కరీంనగర్‌ విద్యావిభాగం

కౌన్సెలింగ్‌కు హాజరైన ఉపాధ్యాయులు(పాతచిత్రం)

పాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ఆగుతూ..సాగుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో మరోసారి ప్రతిబంధకం ఏర్పడింది. 317 జీవో కింద జిల్లాకు కేటాయించిన వారికి కూడా వాటిలో అవకాశాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయంతో ఈప్రక్రియకు ఆటంకం కలిగింది. ఇప్పటికే స్పౌజ్‌ విభాగంలో కొందరు, సచివాలయ పలుకుబడితో మరికొందరు జిల్లాకు రావడంతో బదిలీ ప్రక్రియ ఆలస్యమైంది. అతికష్టమ్మీద జిల్లా విద్యాశాఖాధికారులు జాబితా రూపొందించి ఆన్‌లైన్‌లో పెట్టారు. ఇప్పుడు తాజాగా జీవో కింద కొందరు వచ్చి చేరడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. వీరు 12 నుంచి 14 వరకు దరఖాస్తు చేసుకోనున్నారు. ఇప్పటికే జిల్లాలో స్థానభ్రంశం కోసం 1021 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి సంఖ్య మరింత పెరగనుంది.

వెయ్యి మందికి పైగా...

గతేడాది జనవరిలో 317 జీవో ద్వారా స్థానికత ఆధారంగా సీనియారిటీ ప్రకారం పక్క జిల్లాల్లో పని చేస్తున్న వారిని కరీంనగర్‌ జిల్లాకు, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారిని పక్క జిల్లాలకు కేటాయించారు. 1107 మంది ఉపాధ్యాయులు పక్క జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. ఇక్కడే పని చేస్తూ స్థానికత ఆధారంగా మరో 1495 మంది ఈ జిల్లాలోనే ఉండిపోయారు. మరికొందరు పరస్పర మార్పిడిపై, ఇటీవల స్పౌజ్‌ కింద 75 మంది వచ్చారు. బదిలీ షెడ్యూల్‌ ఆలస్యమైనా న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని టీపీయూఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు కోరారు. అభ్యంతరాలు ఏమైనా వస్తే వాటిని పరిశీలించి సజావుగా పూర్తి చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కె.రవీంద్రాచారి తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని