logo

ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణ

ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేస్తానని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌ చెప్పారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోనున్న చర్యలపై ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

Published : 09 Feb 2023 05:24 IST

అక్రమ దందాలపై ఉక్కుపాదం
న్యూస్‌టుడే, జగిత్యాల

ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేస్తానని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌ చెప్పారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోనున్న చర్యలపై ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రజలతో మమేకం

ప్రజలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తాం. ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ అధికారులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెంచుతాం. ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ఇది వరకే పట్టణాలు, గ్రామాల్లో 3,559 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పోలీసు అధికారులు, సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి వాస్తవమని తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.  

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం

మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. వారి రక్షణలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. షీ బృందాల పనితీరుపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. బహిరంగ ప్రదేశాలు, కళాశాలలు, విద్యాసంస్థల పరిసరాల్లో పోలీసు నిఘా పెంచాం. ఎలాంటి సమాచారమైనా నిర్భయంగా సమీప పోలీసులకు అందిస్తే సత్వరమే చర్యలు తీసుకునే అవకాశముంటుంది.

అసాంఘిక కార్యకలాపాలపై..

గంజాయి మూలంగా యువకులు అనారోగ్యం పాలవడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశముంది. ఈ విషయమై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించి, గట్టి నిఘా ఉంచి అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇటీవల మహబూబాబాద్‌ నుంచి జిల్లా మీదుగా రాజస్థాన్‌కు అంబులెన్స్‌లో తరలిస్తున్న 70 కిలోల గంజాయిని పట్టుకున్నాం.  

ప్రమాదాల నియంత్రణకు చర్యలు

రహదారి ప్రమాదాల నివారణ అందరి బాధ్యతగా గుర్తించాలి. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటాం. గతేడాది రహదారి ప్రమాదాల్లో 200 మంది మృతి చెందితే అందులో 74 మంది వారికి వారు వాహనాలు నడుపుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయటమే కాకుండా డ్రైవింగ్‌ లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తాం. పట్టణాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.  

దొంగతనాలపై ప్రత్యేక నిఘా

దొంగతనాల నివారణలో భాగంగా జిల్లా నలువైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. పాత నేరస్థులపై నిఘా ఉంచుతాం. తరచూ నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగించి జైలుకు పంపుతాం. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు అపరిచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్‌కు ఎవరూ స్పందించకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. బాధితులు టోల్‌ఫ్రీ నంబర్‌ 155260 లేదా 100కు తక్షణమే ఫిర్యాదు చేస్తే కోల్పోయిన నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని