logo

సహకార సంఘాలు.. వ్యాపార వృద్ధి మార్గాలు

ఉమ్మడి జిల్లా పరిధిలో 128 సహకార సంఘాల్లో రైతులకు సేవలు అందించడంతో పాటు మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కామన్‌ సర్వీసు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది.

Published : 21 Mar 2023 06:22 IST

విజయ బ్రాండ్‌ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి

చిగురుమామిడి వ్యవసాయ సహకార సంఘం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: ఉమ్మడి జిల్లా పరిధిలో 128 సహకార సంఘాల్లో రైతులకు సేవలు అందించడంతో పాటు మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కామన్‌ సర్వీసు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. దీంతో రాష్ట్రంలో విజయ సంస్థకు సంబంధించి నూనెలు, బియ్యం, గోధుమ పిండి వంటి ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అన్ని సహకార సంఘాలు, ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల అమ్మకాలు, రైస్‌మిల్లుల నిర్వహణ, సూపర్‌మార్కెట్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు వంటివి ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఉన్నారు. ఇవేకాకుండా సుమారు 36కు పైగా సహకార సంఘాల పెట్రోల్‌ బంకులు నిర్వహిస్తున్నారు. వీటిని పెట్రోలియం సంస్థల ఔట్‌లెట్లుగా మార్చాలని కేంద్రాన్ని కోరుతున్నారు.


ఏప్రిల్‌లో సెంటర్లు

ప్రతీ సంఘ పరిధిలో ఒక కామన్‌ సర్వీసు సెంటర్లు ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 128 సహకార సంఘాలను కంప్యూటీకరణ జరిగింది. ప్రత్యేక సిబ్బంది కూడా ఉన్నారు. ఈక్రమంలోనే కామన్‌ సర్వీసు సెంటర్లు ఏర్పాటు సులభతరం కానుంది. కంప్యూటర్‌, ప్రింటర్‌, బయోమెట్రిక్‌ పరికరం, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ వంటివి అవసరం. ఇవన్నీ ఆయా సహకార సంఘాలకు ఉన్నాయి. ఈ కేంద్రం ఏర్పాటు, నిర్వహణ తీరు వంటి అంశాలపై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రతినిధి శ్రీధర్‌ ఇటీవల జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో వివరించారు. ఆధార్‌ సవరణలు, బీమా డబ్బుల చెల్లింపులు, రైల్వే, విమాన టిక్కెట్ల బుకింగ్‌లు, ప్రధానమంత్రి కిసాన్‌ యోజన రిజిస్ట్రేషన్‌, పాన్‌కార్డుకు దరఖాస్తు చేయడం, తపాలా సేవలు వినియోగించుకోవడం, అయూష్మాన్‌భవ నమోదు, దాదాపు 300 సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒకరికి ఉపాధి లభిస్తోంది. వీటితో పాటు ఆయిల్‌సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా వంటనూనెతో పాటు 66 రకాల బ్రాండ్ల అమ్మకాలకు కూడా ఆ సంస్థ అవకాశం లభిస్తోంది.


ఆదాయ వనరులు పెంచుకునేలా..

సహకార సంఘాల పరిధిలో రైతులకు రుణాలివ్వడం, వసూలు చేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ధాన్యం కొనుగోలు, ఎరువులు విత్తనాల విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. ఛైర్మన్ల జీతభత్యాలు, సంఘాల కార్యనిర్వహణాధికారులు, ఇతర సిబ్బంది జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అదనపు సిబ్బంది కూడా పని చేస్తున్నారు. దీంతో సంఘాల ఆదాయ వనరులు పెంచుకునేలా కార్యచరణ చేపడుతున్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలు అందిస్తాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలు అందేలా రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు రవీందర్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ ఉత్పత్తులు కూడా విక్రయించేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ఏప్రిల్‌లో ప్రారంభం అవుతోంది.

సత్యనారాయణరావు, సీఈవో, కేడీసీసీబీ, కరీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని